ప్రగతి భవన్‌లోనే పంద్రాగస్ట్‌

august 15 celebrations in pragathi bhavan - Sakshi

కరోనా నేపథ్యంలో గోల్కొండలో ఈసారి ఉత్సవాల్లేవ్‌

వేడుకల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్‌

జిల్లా కేంద్రాల్లో జెండాలు ఆవిష్కరించనున్న మంత్రులు, ప్రభుత్వ విప్‌లు

సాక్షి, హైదరాబాద్ ‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆగస్టు 15న ఉదయం 10.30 గంటలకు తన అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్‌ జెండాను ఆవిష్కరించి స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనడం ఆనవాయితీ. కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో వ్యాపించి ఉన్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించాల్సిన ఈ వేడుకలను ఈసారి ప్రగతిభవన్‌కే పరి మితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.

జిల్లా స్థాయిలో మంత్రులు, విప్‌లు..
జిల్లాస్థాయిలో మంత్రులు, ఇతర ముఖ్యులు స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా సంబంధిత జిల్లా కలెక్టరేట్లలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ముఖ్య అతిథుల జాబితాను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్‌ (జగిత్యాల), పువ్వాడ అజయ్‌కుమార్‌(ఖమ్మం), గంగుల కమలాకర్‌ (కరీంనగర్‌), వి.శ్రీనివాస్‌గౌడ్‌ (మహబూబ్‌నగర్‌), సత్యవతిరాథోడ్‌ (మహబూబాబాద్‌), తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (మెదక్‌), చామకూర మల్లారెడ్డి (మేడ్చల్‌ మల్కాజ్‌గిరి), ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్‌), వేముల ప్రశాంత్‌రెడ్డి (నిజా మాబాద్‌), ఈటల రాజేందర్‌ (పెద్దపల్లి), కె.తారకరామారావు (రాజన్న సిరిసిల్ల), రంగారెడ్డి (పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి), ఎండీ మహమూద్‌ అలీ (సంగారెడ్డి), టీ హరీశ్‌రావు (సిద్దిపేట), గుంటకండ్ల జగదీష్‌రెడ్డి (సూర్యాపేట), సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (వనపర్తి), ఎర్రబెల్లి దయాకర్‌రావు (వరంగల్‌ రూరల్‌)

అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి (కామారెడ్డి), డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ (వికారాబాద్‌), మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి(నల్లగొండ), మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ (నారాయణపేట), చీఫ్‌ విప్‌లు బోడకుంటి వెంకటేశ్వర్లు (జనగామ), దాస్యం వినయభాస్కర్‌ (వరంగల్‌ అర్బన్‌), ప్రభుత్వ విప్‌లు గంప గోవర్దన్‌ (ఆదిలాబాద్‌), రేగల కాంతారావు (భద్రాద్రి కొత్తగూడెం), టీ భానుప్రసాదరావు (జయశంకర్‌భూపాలపల్లి), కె.దామోదర్‌రెడ్డి (జోగులాంబ గద్వాల), అరికెపుడి గాంధీ (కుమ్రంభీం ఆసిఫాబాద్‌), బాల్క సుమన్‌ (మంచిర్యాల), ఎంఎస్‌ ప్రభాకర్‌రావు (ములుగు), గువ్వల బాలరాజు (నాగర్‌కర్నూల్‌), గొంగిడి సునీత (యాదాద్రి భువనగిరి) జిల్లా స్థాయిలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్లు, జడ్పీ చైర్‌పర్సన్లు, డీసీసీబీ/డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, ఇతర జిల్లాస్థాయి అధికారులు జిల్లాస్థాయిలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రభుత్వం కోరింది. ఉదయం 9.30 గంటలకు వీరంతా తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలని సూచించింది. మండల స్థాయిలో ఎంపీపీలు, గ్రామస్థాయిలో సర్పంచ్‌లు జాతీయను జెండాను ఆవిష్కరించాలని స్పష్టం చేసింది. కరోనా మమహ్మరి నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లను వినియోగించాలని ఆదేశించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top