
హైదరాబాద్: ఆషాఢ మాస బోనాల విశిష్టతను, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటుదామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే బోనాల జాతరను పురస్కరించుకొని మంగళవారం గోల్కొండలో నిర్వహించిన అధికారుల సమన్వయ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బోనాలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వసతులు కలిపంచాలి సూచించారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
ముఖ్యంగా పర్యాటక శాఖ బోనాల బోనాల విశిష్టతను తెలియజేస్తూ పర్యాటకులను ఆకర్షించేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రస్తుత తరం చిన్న చిన్న వీడియోలు, రీల్స్కు ఆకర్షితులవుతున్నారని.. సమాచార శాఖ ఈ అంశంపై దృష్టి పెట్టాలని.. చిన్న వీడియోల రూపంలో బోనాల గొప్పదనంపై అనేక రకాలుగా ప్రచారాలు నిర్వహించాలన్నారు. గతంలో ఉన్నట్లు ఆషాఢ మాసాంతం గోల్కొండ కోటలో ప్రవేశం ఉచితంగా ఇవ్వాలని, ప్రస్తుతానికి మంగళవారం కూడా ఉచిత ప్రవేశం కోరుతూ పురావస్తు శాఖకు సూచిస్తున్నట్లు పేర్కొన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ..
గోల్కొండ బోనాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం నగర నలుమూలల నుంచీ ఆర్టీసీ బస్సులు నడపనున్నామన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, గోల్కొండ జగదాంబిక ఆలయ చైర్మన్ కొండెపుడి చంటిబాబు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ కోట లోపల నాగదేవత పుట్ట వద్ద పూజలు చేసి అమ్మవారికి కల్లు సాక పెట్టారు.