కుసుమ్‌కు ఈఆర్సీ ఆమోదం | Approval for purchase of 4000 megawatts of solar power | Sakshi
Sakshi News home page

కుసుమ్‌కు ఈఆర్సీ ఆమోదం

Apr 23 2025 3:13 AM | Updated on Apr 23 2025 3:13 AM

Approval for purchase of 4000 megawatts of solar power

4,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు అనుమతి 

యూనిట్‌కు రూ.3.13 ధరతో కొనేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ 

కుసుమ్‌ కింద రాష్ట్రానికి 1,000 మెగావాట్లకే అనుమతి 

మిగిలిన 3,000 మెగావాట్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌: పీఎం–కుసుమ్‌ పథకం కాంపోనెంట్‌–ఏ కింద 4,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ) అనుమతిచ్చింది. మహిళాశక్తి పథకం కింద స్వయం సహాయ సంఘాల (ఎస్‌హెచ్‌జీ) నుంచి 1,000 మెగావాట్లు, రైతుల నుంచి 3,000 మెగావాట్లు కలిపి మొత్తం 4,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ను యూనిట్‌కు రూ.3.13 ధరతో 25 ఏళ్లపాటు కొనుగోలు చేసేందుకు అనుమతిస్తూ ఈఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

కుసుమ్‌ పథకం కాంపోనెంట్‌–ఏ కింద కేంద్రం గతంలో రాష్ట్రానికి 4,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతిచ్చి, ఆ తర్వాత 1,000 మెగావాట్లకు తగ్గించింది. రాష్ట్రప్రభుత్వం మాత్రం 4,000 మెగావాట్ల సౌర ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో) ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) ఆహ్వానించగా, పెద్ద సంఖ్యలో దరఖాస్తులొచ్చాయి. 

కేంద్రం 1,000 మెగావాట్లకే అనుమతివ్వగా, మిగిలిన 3,000 మెగావాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు ఏ విధంగా అనుమతులిస్తారని గతంలో ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణలో కొందరు ప్రశ్నించారు. రద్దు చేసిన 3000 మెగావాట్ల అనుమతులను మళ్లీ పునరుద్ధరించాలని కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టీఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ అలీ ఫారూఖీ తెలిపారు. ఒకవేళ కేంద్రం అనుమతివ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యామ్నాయ మార్గంలో ఈ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. 

ఈ పథకం కింద సౌరవిద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు గత నెలలో ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించిన తర్వాత, అందుకు అనుమతి కోరుతూ ఈఆర్సీకి దరఖాస్తు చేయగా.. ముందు తీసుకున్న చర్యలకు తర్వాత అనుమతులు ఇవ్వలేమని డిస్కంలకు ఈఆర్సీ స్పష్టం చేసింది. రైతులు–డెవలపర్ల మధ్య జరిగే భూముల లీజు ముసాయిదా ఒప్పందాన్ని సైతం ఆమోదించడానికి నిరాకరించింది. ముసాయిదా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)కు మాత్రం ఆమోదం తెలిపింది.    

28 వేల సౌర పంప్‌సెట్ల ఏర్పాటు 
కుసుమ్‌–సీ కాంపోనెంట్‌ కింద రాష్ట్రానికి 28 వేల సోలార్‌ పంప్‌సెట్లను కేంద్రం మంజూరు చేసిందని డిస్కంలు ఈఆర్సీకి తెలిపాయి. కాంపోనెంట్‌–బీ కింద ఆఫ్‌ గ్రిడ్‌ సోలార్‌ పంప్‌సెట్ల ఏర్పాటుకు సైతం అనుమతులు కోరుతున్నామని వివరించాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement