
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఏసీబీ దాడుల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ నివాసాలపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారులు సోదాలు చేపట్టారు.
వివరాల ప్రకారం.. ఏసీబీ అధికారులు ఏకకాలంలో హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేటలోని 12 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. శ్రీధర్ ఎస్ఆర్ఎస్పీ డివిజన్-8లో ఈఈగా పని చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీల పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇరిగేషన్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు శ్రీధర్పై ఆరోపణలున్నాయి. నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.