తల్లి పక్కన ఉండగానే అడవి జంతువుల దాడి!

4 Years Boy Dies In Wild Animals Attack At Turkapally In Medchal District - Sakshi

బాలుడి మృతి

తుర్కపల్లి: అడవి జంతువులు ఓ చిన్నారిని చిదిమేశాయి. వాటి దాడిలో నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామశివారులో గురువారం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా వాపన్‌ పల్లి కాలనీకి చెందిన శివ, అతని కుమారుడు హరీశ్‌ కుటుంబం సహా నెలరోజుల క్రితం వాసాలమర్రికి వలసవచ్చారు. హరీశ్‌కు భార్య గంగోత్రి, కుమారుడు మునేశ్వర్‌రావు(4) ఉన్నారు. రోజుమాదిరిగానే బుధవారం సాయంత్రం వరకు కోళ్లు అమ్ముకొని వచ్చి రాత్రి భోజనం చేసి నిద్రపోయారు.

అటవీప్రాంతం కావడంతో పాములు, తేళ్ల భయానికి మునేశ్వర్‌రావు పక్కన తల్లి గంగోత్రి, ఆమెకు రక్షణగా భర్త హరీశ్, మరోపక్కన తాత శివ పడుకున్నారు. అర్ధరాత్రి బాలుడు ఏడవడంతో తల్లి గంగోత్రి నిద్రలేచి పాలిచ్చింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో తల్లి లేచి చూడగా కొడుకు తలను కొరికివేసినట్టుగా ఉండటం చూసి గట్టిగా కేకలేయడంతో భర్త, మామ నిద్రలేచారు. బాలుడి తల రక్తమడుగులో ఉంది. తీవ్రగాయాలపాలై కళ్లు బయటికి వచ్చాయి. రాత్రి 2.30 గంటల సమయంలో బాలుడి తలను అడవిజంతువులు కొరికివేసి ఉంటాయని అనుమానిస్తున్నారు. కాగా, బాలుడి తలను కొరికివేసింది కుక్కలా.. అడవిజంతువులా అనేది తేలాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక వచ్చాక అసలు విషయం బయటపడుతుందని పోలీసులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top