Abhishek Mohanty: పోలీస్‌ ‘సింగం’ బదిలీ! | 21 IPS Officers Transferred In Major Reshuffle In Telangana, Know About CP Abhishek Mohanty | Sakshi
Sakshi News home page

Abhishek Mohanty: పోలీస్‌ ‘సింగం’ బదిలీ!

Mar 8 2025 10:26 AM | Updated on Mar 8 2025 11:23 AM

21 IPS officers transferred in major reshuffle in Telangana

కరీంనగర్‌పై అభిషేక్‌ మహంతి మార్క్‌

భూదందాలపై ఉక్కుపాదం

సీపీ దెబ్బకు భూబకాసురులు విదేశాలకు పరారీ

సిఫారసుల్లేకుండా పోస్టింగులు దక్కిన ఏకైక కమిషనరేట్‌ 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఒకప్పుడు కరీంనగర్‌లో సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే.. కార్పొరేటర్‌కి రూ.లక్ష, ప్రతీ అనుమతికి ఇంత అంటూ ఫిక్స్‌డ్‌ రేట్లు ఉండేవి. ఖాళీజాగా కనిపిస్తే ఫోర్జరీ డాక్యుమెంట్లతో కబ్జారాయుళ్లు దిగిపోయేవారు. తాము అడిగినంత ఇవ్వకపోతే కడుతున్న ఇండ్లు కూడా బుల్డోజర్లతో కూల్చేసేవారు. అప్పుడు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషించారు తప్ప.. ఎవరినీ కనీసం అరెస్టు చేయలేకపోయారు. అదే సీపీగా అభిషేక్‌ మహంతి(Abhishek Mohanty) వచ్చాక సీన్‌ మారింది. 

భూదందాలు చేసేవారికి చెమటలు పట్టించారు. భూనేరాల్లో పాలుపంచుకున్న రాజకీయ నేతలు, తహసీల్దార్లు ఎవరినీ వదల్లేదు. నిజాయతీగా, ముక్కుసూటిగా వ్యవహరించే మహంతి ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా.. తలొగ్గకుండా..  తనపని తాను చేసుకుంటూ పోయారు. అందరికీ తన మార్కు కోటింగ్‌ ఇస్తుండటంతో పలువురు నేతలు అరెస్టు భయానికి ఏకంగా దేశం విడిచి పారిపోయిన వారు ఇంకా అక్కడే తలదాచుకోవడం గమనార్హం. 

కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే సీపీగా ఉంటారన్న అపవాదు కరీంనగర్‌ పోస్టింగ్‌తో తొలగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చిన ఆయన అసెంబ్లీ, పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికలను  విజయవంతంగా నిర్వహించారు. తప్పులు చేస్తే.. సొంత డిపార్ట్‌మెంటు వారిని కూడా వదలకుండా డీజీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. సిఫారసు లెటర్లు లేకుండా రాష్ట్రంలో నిజాయతీ అధికారులకు ఎస్‌హెచ్‌వోలుగా పోస్టింగులు ఇచ్చారు. తమ లెటర్లకు పోస్టింగులు ఇవ్వడంలేదని కొందరు ప్రెస్‌మీట్లు పెట్టినా.. ఆయన తొణకలేదు. అందుకే, ఆయన్ని సహచరులు పోలీస్‌ సింగంగా పిలుచుకుంటారు.

భూదందా అంటే లోపలికే..
భూదందాలు చేస్తూ మోసంచేస్తున్నారన్న ఫిర్యాదులు పెద్దఎత్తున రావడంతో డీజీపీ అనుమతితో ఎకానివిుక్స్‌ అఫెన్సెస్‌ వింగ్‌ ఏర్పాటుచేసి భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపారు. రాజకీయనాయకులు, బడావ్యాపారులు తేడా లేకుండా అన్యాయం జరిగిన వారి పక్షాన నిలిచి కమిషనరేట్‌ వ్యాప్తంగా సుమారు 250కిపైగా మందిపై కేసులు నమోదు చేసి కటకటాల్లోకి పంపించారు. వివిధ పార్టీల నేతలు చేసిన కబ్జాలు, డబుల్‌ రిజిస్ట్రేషన్‌లపై వచ్చిన ఫిర్యాదులపై ఎకానివిుక్స్‌ అఫెన్సెస్‌ వింగ్‌తో లోతుగా దర్యాప్తు చేయించి ఎలాంటి ఒత్తిడిలకు తలొగ్గకుండా అక్రమార్కులను జైలుకు పంపించారు. దీనితర్వాత ఫైనాన్స్‌ నిర్వాహకులు పెద్దఎత్తున ఖాతాదారుల వద్ద డబ్బులు డిపాజిట్‌ చేయించుకొని తిరిగి చెల్లించడం లేదని గమనించి ఒక ప్రముఖ చిట్‌ఫండ్‌పై కేసులు నమోదు చేసి నిర్వాహకులను కటాకటాల్లోకి పంపించి వాటికి సంబంధించిన ఆస్తులు ప్రభుత్వం ద్వారా అటాచ్‌ చేపించారు. వందలాది మంది భూబాధితులు, ఫైనాన్స్‌లతో మోసపోయిన వారికి న్యాయం చేశారు. 

గంజాయి, సైబర్‌ నేరాలపై     ఉక్కుపాదం...
కరీంనగర్‌ సీపీగా అభిషేక్‌ మహంతి వచ్చిన తర్వాత గంజాయి, సైబర్‌ నేరాలపై దృష్టి పెట్టారు. గంజాయి కేసుల దర్యాప్తుకోసం నార్కోటిక్స్‌ విభాగం ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించి నిందితులను జైలుకు పంపించారు. సైబర్‌ పోలీస్‌స్టేషన్‌ను పటిష్టం చేసి ప్రతీ స్టేషన్‌కు సైబర్‌ వారియర్‌ను కేటాయించి వారితో నేరాల కట్టడికి కృషిచేశారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పించారు. 

కమిషనరేట్‌లోనూ.. 
మహంతి ఆధ్వర్యంలో పలుఅభివృద్ధి పనులు జరిగాయి. మహిళల భద్రతకు ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ఇటీవల డీజీపీ జితేందర్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్రస్థాయి పోలీసు క్రీడాఉత్సవాలను కరీంనగర్‌ వేదిక విజయవంతంగా నిర్వహించారు. కమిషనరేట్‌లో ఫంక్షన్‌ హాల్‌ ఆధునీకరణ, పోలీస్‌ కేఫ్‌ ఏర్పాటుతోపాటు వివిధ సంక్షేమ పనులు నిర్వహించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement