బీపీతో హార్ట్‌ఎటాక్‌ | 16 lakh people die of BP every year in India | Sakshi
Sakshi News home page

బీపీతో హార్ట్‌ఎటాక్‌

May 17 2024 5:27 AM | Updated on May 17 2024 5:27 AM

16 lakh people die of BP every year in India

బీపీ అదుపులో ఉంటే గుండెపోటు మరణాలను సగం తగ్గించవచ్చు 

ఏటా భారత్‌లో 16 లక్షల మంది బీపీతో చనిపోతున్నారు 

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు మొదటి ప్రధాన కారణం అధిక బీపీనే

ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: బీపీతో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. భారత్‌లో ఏటా అధిక రక్తప్రసరణతో వచ్చే గుండెపో­టు, పక్షవాతంతో 16 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలో సంభవించే మరణాలకు మొద­టి ప్రధాన కారణం బీపీ ఎక్కు­వగా ఉండటమే. రెండో కారణం శ్వా­స­కోశ ఇన్‌ఫెక్షన్లు, మూడోది డయేరియా, నాలు­గోది ఎయిడ్స్, ఐదోది టీబీ, ఆరోది మలేరియా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), భారతీ­య వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉమ్మడి నివేదిక తేలి్చచెప్పింది. ఆయా సంస్థలు బీపీని కట్టడి చేసే విధానంపై నివేదిక రూపొందించాయి.

2017లో ప్రారంభమైన ఇండియన్‌ హైపర్‌ టెన్షన్‌ కంట్రోల్‌ ఇనీషియేటివ్‌ (ఐహెచ్‌సీఐ)ను ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడింది. 2025 నాటికి దేశంలో బీపీ రోగుల సంఖ్యను 25 శాతం తగ్గించాలని నిర్ణయించింది. ఐహెచ్‌సీఐ కార్యక్రమాన్ని ఈ మూడు సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి. 25 రాష్ట్రాల్లోని 141 జిల్లాల్లో ఈ కార్య­క్రమం జరుగుతుంది. 21,579 ఆరో­గ్య కేంద్రాల్లో 30 కోట్ల మందిని ఈ కార్యక్రమం పరిధిలోకి వచ్చారు. 19 రాష్ట్రాల్లో బీపీ నియంత్రణ ప్రొటోకాల్‌ తయారుచేశారు. ఈ కార్యక్రమం మొదటి దశ తెలంగాణ, పంజాబ్, కేరళ, మధ్యప్ర­దేశ్, మహారాష్ట్రల్లో ప్రారంభమైంది.

18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ... 
భారత్‌లో 18 ఏళ్లు పైబడిన ప్రతీ నలుగురిలో ఒకరికి బీపీ ఉంది. అలా 20 కోట్ల మంది బీపీతో బాధపడుతున్నారు. అందులో సగం మందికి బీపీ ఉన్నట్లే తెలియదు. కేవలం 10 శాతం మందే బీపీని అదుపులో ఉంచుకుంటున్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికీ బీపీ చెక్‌ చేయాలని ఆ నివేదిక పే­ర్కొంది. 2025 నాటికి 4.5 కోట్ల మంది బీపీని అదుపులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 
నివేదికలోని ముఖ్యాంశాలు... 

⇒ ఐహెచ్‌సీఐ కార్యక్రమం అమలయ్యే చోట నర్సులు, డాక్టర్లు ప్రత్యేకంగా ఉంటారు. అయితే, తెలంగాణ, మహారాష్ట్రల్లో మాత్రమే ప్రత్యేకంగా ఉన్నారు.  
⇒ తెలంగాణలో ఈ విధానం అమలులో ఉన్నందున ఏఎన్‌ఎంలు ఇళ్లకు వెళ్లి బీపీ చెక్‌ చేస్తున్నారు. ఫోన్‌ ద్వారా కూడా ఫాలోఅప్‌ చేస్తున్నారు.  
⇒  ఈ కార్యక్రమం కోసం సగటున ఒక వ్యక్తికి ఏడాదికి రూ. 200 మాత్రమే మందుల కోసం ఖర్చవుతుంది. 
⇒  బాధితులు ప్రొటోకాల్‌లో ఉన్న మందులను ఒక నెల అడ్వాన్స్‌లో ఉంచుకోవాలి.  
⇒ తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్‌లలో 6 నె­ల­ల­కు సరిపడా నిల్వలు ఉన్నాయి. కేరళలో నెల రోజులు, మహారాష్ట్రలో 2 నెలల స్టాక్‌ ఉంది.  

బీపీ రోగులు వ్యాయామం చేయాలి 
బీపీ రోగులు పొగాకు, మద్యం మానుకోవాలి. ఉప్పు ఒక స్పూన్‌కు తగ్గించుకోవాలి. ప్రతీ వారం రెండున్నర గంటల వ్యాయామం చేయాలి. రోజుకు నాలుగైదు సార్లు పండ్లు, కూరగాయలు తినాలి. తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ బీపీ చెక్‌ చేయాలన్న నియమం పెట్టుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో 30 ఏళ్లు పైబడిన వారికే బీపీ చూస్తారు. బీపీ ఉంటే ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు. మందులు తప్పనిసరిగా వాడాలి.  –డాక్టర్‌ కిరణ్‌ మాదల, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం   

Advertisement
 
Advertisement
Advertisement