Congress Party: తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ మాదే.. | Congress Celebrate Telangana Formation day Celebrations at Hyderabad | Sakshi
Sakshi News home page

Congress Party: తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ మాదే..

Jun 2 2023 8:10 PM | Updated on Jun 2 2023 9:20 PM

Congress Celebrate Telangana Formation day Celebrations at Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మరోసారి గుర్తు చేసేలా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్‌ నగరంలో నిర్వహించిన వేడుకలకు మాజీ లోక్‌సబ స్పీకర్ మీరాకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెసేనని హస్తం నేతలు గట్టిగా నినదించారు. కాంగ్రెస్ లేకుంటే ,తెలంగాణ వచ్చేది కాదని.. అయితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు కేసీఆర్‌ వెన్నుపోటు పొడిచారని టీ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. తరువాత టీ కాంగ్రెస్ నేతలతో పాటు మీరా కుమార్ తెలంగాణ ఏర్పాటును గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వచ్చినా ప్రజల ఆశయాలు నెరవేరలేదని, తెలంగాణ ప్రజల ఆశయాలు నెరవేర్చేది కాంగ్రెస్ మాత్రమేనని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని మీరా కుమార్ తెలంగాణ ప్రజలను కోరారు.

"తెలంగాణ ఆశయాలు నెరవేర్చాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. తెలంగాణ ప్రజలు ఏ లక్ష్యం కోసం కోట్లాడారో ఆ లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ అన్ని వర్గాల ప్రజల త్యాగాలను చూసి కాంగ్రెస్ త్యాగం చేసి మరి తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా దేశంలో తెలంగాణ నెంబర్ 1 ఉండాలంటే తెలంగాణ ఆశయాలు తెలిసిన కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. తెలంగాణ ప్రజల త్యాగాలు, ఆశయాలు కాంగ్రెస్‌కు మాత్రమే తెలుసు"
- మీరా కుమార్, లోక్‌సభ మాజీ స్పీకర్‌

"ఉద్యోగాల విషయంలో మనకు అన్యాయం జరుగుతోందని నాడు 1200మంది బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అప్పటి హోంమంత్రి చిదంబరం తో రెండు సార్లు చర్చించా.. అది నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. మీరాకుమార్ ఎంతో ధైర్యంతో తెలంగాణ బిల్లును పాస్ చేసారు. మీరాకుమార్ ధైర్యం చేయకుంటే తెలంగాణ వచ్చేది కాదు. ఇప్పుడు ఏలుతున్న వారు తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ ఏర్పాటును మోదీ అపహాస్యం చేశారు. పార్లమెంట్ తలుపులు మూసేసి తెలంగాణ ఇచ్చారని పార్లమెంట్‌లో మోదీఆరోపిస్తున్నారు. బీజేపీ వాళ్లు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
చదవండి: Hyderabad: మెట్రో ప్రయాణికులకు మరో షాక్‌

తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు కేసీఆర్ పార్లమెంట్‌లో లేరు. మీరాకుమార్ రాష్ట్రపతి అభ్యర్థిగా హైదరాబాద్ వస్తే..మీరాకుమార్‌కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ కు ఫోన్ చేసినా మాట్లాడలేదు. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన మీరాకుమార్‌కు వ్యతిరేకంగా కేసీఆర్ ఓటు వేశారు. నేరేళ్ళ బాధితులను పరామర్శించేందుకు మీరాకుమార్ వస్తే.. కేసీఆర్ అవహేళన చేసారు. 9 ఏళ్ళు పూర్తయితే.. ఎన్నికల కోసం ఓక సంవత్సరం ముందుగానే దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపాలి."
- ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

"తెలంగాణలో యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. రైతులు సమస్యలతో సతమతమవుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. తెలంగాణ ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేర్చకుందాం."
-మాణ్‌క్ రావ్ ఠాక్రే

"అసమానతలు ఉన్న ప్రాంతాల్లో తిరుగుబాటు వస్తుంది. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. చారిత్రక నిర్ణయం వెనక సోనియా గాంధీ కృషి ఎంతో ఉంది. ఆనాటి తెలంగాణలో రాష్ట్రానికి ఉన్న గౌరవం, ఇప్పుడు ఉన్న గౌరవం ఎలా ఉందో అందరూ గమనిస్తున్నారు. రెండు సార్లు ఒకే కుటుంబ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు అవసరం గురించి నాడు గంట పాటు సోనియా గాంధీ కి వివరించా."
-దామోదర రాజనర్సింహ

"తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ చొరవ వల్లే తెలంగాణ వచ్చింది. ఇప్పటికీ రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదు. కేసీఆర్‌ కుటుంబం తప్ప సామాన్యుడికి ఒరిగిందేమి లేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఏమైంది.. ఉద్యోగాలు ఏమయ్యాయి. మనం కోరుకున్న తెలంగాణ ఇదేనా..? మళ్ళీ గడీల పాలన నడుస్తోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ తో కలిసి బిఆరెస్ చేస్తుంది. కవిత విషయంలో అది నిరూపితమైంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జలు పట్టం గడుతారు. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దె దించాలి. నిజమైన బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యం."
-మహేష్ గౌడ్

పార్టీలో అందరికంటే సీనియర్ ను నేనే. కడుపు చించుకుంటే పేగులు బయటపడుతాయని చెప్పడం లేదు. తెలంగాణ ఇస్తే సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటా అని కేసీఆర్ చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం వల్లే నష్టం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను అనడం తో కాంగ్రెస్‌కు భారీ నష్టం జరిగింది. కొట్లాడింది, తెచ్చింది మేము. 
-వి.హనుమంతరావు

Advertisement
 
Advertisement
Advertisement