తిరుత్తణి: ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ మధ్యలో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో నదుల్లో వరద ప్రవాహానికి వీలుగా ఆక్రమణలు, తొలగింపు పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. తిరుత్తణి ప్రాంతంలోని నందినది, పళ్లిపట్టు ప్రాంతంలోని కుశస్థలి నదుల్లో వర్షా కాలంలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వరద ప్రవాహానికి నదిలో అడ్డంకులు, ఆక్రమణలు, చెట్లు, ముళ్ల పొదలు తొలగించి పూడికతీత పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తిరుత్తణిలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నదుల్లో పూడికతీత పనులు చేపట్టారు. డివిజన్ జలవనరుల శాఖ అధికారి దిలీప్కుమార్ మాట్లాడుతూ నంది, కుశస్థలి నదుల్లోని బ్రిడ్జిల వద్ద వరద ప్రవాహానికి అడ్డంగా వున్న మట్టి దిమ్మెలు, చెట్లు, ముళ్ల కంపలు తొలగించి పూడిక తీత పనులు చేపడుతున్నట్లు తెలిపారు. తద్వారా వరద నీరు పొలాలు, గ్రామాలను ముంచెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. 15 ప్రాంతాల్లో నదులు పూడికతీత పనులు చేపడుతున్నట్లు తెలిపారు.


