వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ అధికారులకు సీనియారిటీ జాబితా ప్రకారం పదోన్నతులు కల్పించాలని రెవెన్యూ అధికారులు కోరారు. వారు శుక్రవారం వేలూరు కలెక్టర్ కార్యాలయంలోని క్యాబిన్లో ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ వేలూరు జిల్లాలో 2022 నుంచి 2025 వరకు దేవాదాయ శాఖ అధికారులకు పదోన్నతులు కల్పించలేదన్నారు. ఈ విషయమై దేవాదాయ శాఖ జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశామన్నారు. ఈ పరిస్థితిలో వేలూరు జిల్లాలో దేవాదాయ శాఖ అధికారులకు పదోన్నతుల జాబితాను జిల్లా యంత్రాంగం ఈ నెల 9వ తేదీన ప్రచురించిందని, అందులో 40 మందికి మాత్రమే పదోన్నతులు లభించాయని పేర్కొన్నారు. ఈ జాబితా ప్రకారం వీరిలో ఏడుగురు జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఉన్నారని, తమకు బదులు ఏడుగురు సీనియర్ రెవెన్యూ అధికారులను జాబితాలో చేర్చాలంటూ డిమాండ్ చేశారు. తమిళనాడు రాష్ట్ర రెవెన్యూ శాఖ అధికారుల సంఘం, డైరెక్ట్ అపాయింటెడ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 50 మందికి పైగా రెవెన్యూ అధికారులు కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ గది ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వీటిపై విచారణ జరిపి వెంటనే సీనియారిటీ జాబితా ప్రకారం రెవెన్యూ అధికారులకు పదోన్నతులు కల్పించాలని, లేనిపక్షంలో పోరాటాలను తీవ్రతరం చేస్తామని తెలిపారు.


