సాక్షి, చైన్నె : మహాకవి సుబ్రహ్మణ్య భారతి వర్ధంతిని పురస్కరించుకుని చైన్నెలోని ఆయన విగ్రహానికి తమిళనాడు ప్రభుత్వం తరఫున మంత్రులు ఘంనగా నివాళులర్పించారు. సెప్టెంబరు 11వ తేదీని తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా మహాకవి దినంగా నిర్వహిస్తోంది. మహాకవి భారతి వర్ధంతిని పురస్కరించుకుని చైన్నె మెరీనా బీచ్, కామరాజర్ రోడ్డులో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి ప్రవాస తమిళుల సంక్షేమ శాఖ మంత్రి కె.తెన్నరసు, మానవ వనరుల నిర్వహణ శాఖ మంత్రి టి.శరత్కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రలు మాట్లాడుతూ భారతియార్ జీవిత విశేషాలను గుర్తుచేశారు. చిన్న వయసులోనే అద్భుతమైన కవితలు అల్లే ప్రతిభ కనబరిచారని, తమిళం, ఆంగ్లం, హిందీ, సంస్కృతం, బెంగాలీ, ఫ్రెంచ్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారని వివరించారు. మదురై సేతుపతి హైస్కూల్లో తమిళ ఉపాధ్యాయుడిగా, ఆ తర్వాత చైన్నెలో సుదేశమిత్రన్ పత్రికకు అసిస్టెంట్ ఎడిటర్గా, ఇండియా వారపత్రికకు ఎడిటర్గా పనిచేశారని, కర్మయోగి పత్రికను కూడా నడిపారని తెలిపారు. తన కవితలు, వ్యాసాల ద్వారా ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించారని, సీ్త్ర పురుష సమానత్వం కోసం, మహిళా విముక్తి కోసం గళమెత్తారని వివరించారు. వందేమాతరం, పాఠశాలలన్నీ ఆలయాలుగా మారుస్తాం అని నినాదమివ్వడమే కాకుండా, స్వాతంత్య్రానికి ముందే నదుల అనుసంధానానికి పిలుపు నిచ్చారని పేర్కొన్నారు. మహాకవి భారతి జ్ఞాపకార్థం ఎట్టయపురం, చైన్నె ట్రిప్లికేన్లో ఆయన నివసించిన ఇళ్లను స్మారక భవనాలుగా తీర్చిదిద్దడమే కాకుండా, ఎట్టయపురంలో మణిమండపం కూడా ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సమాచార శాఖ కార్యదర్శి వి.రాజారామన్, పీఆర్వో డైరెక్టర్ అరుణ్ తంబురాజ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


