తిరుమల: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా విధులు నిర్వర్తించేందుకు వచ్చిన డిప్యూటేషన్ అధికారులు సేవాభావంతో విధులు నిర్వర్తించాలని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. శుక్రవారం తిరుమల ఆస్థాన మండపంలో డిప్యూటేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అదనపు ఈఓ మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఉద్యోగులందరికీ పూర్తి అవగాహన ఉండాలని కోరారు. ఈసారి రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భక్తులతో మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. టీటీడీ సీవీఎస్ఓ మురళీకష్ణ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తించాలని కోరారు. టీటీడీ ఇన్చార్జి సీఈ మనోహరం, ఎస్ఈ వేణుగోపాల్, డిప్యూటీ ఈఓలు భాస్కర్, రాజేంద్ర, సోమన్నారాయణ, క్యాంటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, వీజీఓ సురేంద్ర పాల్గొన్నారు.


