● స్పార్క్ మిండా ఫౌండేషన్తో ఐఐటీ మద్రాస్ ఒప్పందం
సాక్షి, చైన్నె : అంగవైకల్యం ఉన్నవారికి మరింత అందుబాటులో ఉండేలా, దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కదం కృత్రిమ మోకాలు తయారీ కోసం ఐఐటీ మద్రాస్, టెక్నాలజీ ట్రాన్ఫర్ ఆఫీస్, స్పార్క్ మిండా ఫౌండేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. 2030 నాటికి 50 వేల కృత్రిమ అవయవాలను అమర్చాలనే లక్ష్యంతో స్పార్క్ మిండా ఫౌండేషన్ ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. అభివృద్ధి చెందిన, దేశీయ కృత్రిమ అవయవాల పరిష్కారాలను అందించడంలో భాగంగా ఐఐటీ మద్రాస్, స్పార్క్ మిండా ఫౌండేషన్ మధ్య నాన్–ఎక్స్క్లూజివ్ టెక్నాలజీ లైసెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. అసమాన భూభాగాలు, గరుకై న ప్రదేశాలలో కూడా సులభంగా నడవడానికి వీలుగా కదం కృత్రిమ మోకాలిని ఐఐటీ మద్రాస్ నేషనల్ సెంటర్ ఫర్ అసిస్టెంట్ హెల్త్ టెక్నాలజీస్, ఆర్2డీ2 హెడ్ ప్రొఫెసర్ సుజాత శ్రీనివాసన్ ఆధ్వర్యంలో రూపొందించారు. ఐఐటీ మద్రాస్ పరిశోధన, ఇంజినీరింగ్ నైపుణ్యాలు, స్పార్క్ మిండా ఫౌండేషన్ తయారీ, పంపిణీ సామర్థ్యాలను అనుసంధానించడం ద్వారా ఈ దేశీయ చలనశీలత పరిష్కారాన్ని మరింత ఎక్కువ మందికి చేరవేయడమే ముఖ్య ఉద్దేశమని అధికారులు ప్రకటించారు. కార్యక్రమంలో స్పార్క్ మిండా ఫౌండేషన్ చైర్పర్సన్ సరిక మిండా మాట్లాడుతూ వికలాంగుల కోసం మరింత సమగ్ర సమాజాన్ని నిర్మించడంలో విద్యాపరమైన ఆవిష్కరణలు, పారిశ్రామిక సామర్థ్యాలు కలవడానికి ఇదొక గొప్ప మైలురాయి అని వ్యాఖ్యలు చేశారు. దివ్యాంగులు తమ స్వయంప్రతిపత్తిని సాధించేందుకు సరైన సాంకేతికతను అందించడమే తమ లక్ష్యమని ప్రొఫెసర్ సుజాత శ్రీనివాసన్ పేర్కొన్నారు.


