– మద్రాస్ హైకోర్టు బెంచ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: శివగంగ జిల్లా మానామదురై తాయాపురం గ్రామంలో నిర్మించిన కొత్త చర్చి భవనాన్ని తొలగించాలని కోరుతూ మారిముత్తు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కొట్టివేసింది. జస్టిస్ దండపాణి, జస్టిస్ దిలీప్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. అలాగే, చర్చి నిర్మాణం ప్రైవేట్ పట్టా భూమిలో జరిగిందని, గత 25 ఏళ్లుగా అక్కడ ప్రార్థనా మందిరం కొనసాగుతోందని, పునర్నిర్మాణం కోసం 2018 సెప్టెంబర్లో స్థానిక సంస్థల నుంచి సరైన అనుమతులు పొందినట్లు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయన్న వాదనలు కోర్టుకు చేరింది. చర్చికి సమీపంలోని ముత్తు మారియమ్మన్ కోవెల మధ్య 45 మీటర్ల దూరం ఉందని, వారికి చర్చి పై ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. నిర్మాణం గానీ, ప్రార్థనలు గానీ ఎలాంటి చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించలేదు. వేర్వేరు మతాలకు చెందిన ప్రజలు ప్రశాంతంగా కలిసి జీవించే రాజ్యాంగ హక్కును, ఆధారాలు లేని భయాల నెపంతో అడ్డుకోలేమని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ ఆ ప్రాంతానికి చెందినవాడు కాదని, చర్చి నిర్మాణానికి అనుమతినిచ్చిన జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల్లో ఎలాంటి అక్రమాలు లేదా లోపాలు లేవని స్పష్టం చేస్తూ పిటిషన్ను కొట్టివేసింది.


