సాక్షి, చైన్నె: ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం కావడానికి ముందే అసంపూర్తిగా ఉన్న తాగునీరు, డ్రైనేజీ కాలువలు, రహదారి పనులను తక్షణమే పూర్తి చేయాలని సీఎం విజయ్ మంత్రులు, అధికారులను ఆదేశించారు. రాబోయే ఈశాన్య రుతుపవనాల దృష్ట్యా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై సచివాలయంలో ఆయన అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చైన్నె, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు, విల్లుపురం, తిరువణ్ణామలై జిల్లాల్లో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
విద్యుత్ భద్రత
తెగిపోయే స్థితిలో ఉన్న, బలహీనంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, వైర్లను విద్యుత్ శాఖ తక్షణమే సరి చేయాలని, వర్షాల వలన ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వరద నీటిని తోడేందుకు మోటార్లు, కూలిన చెట్లను తొలగించేందుకు ఎలక్ట్రిక్ రంపాలు, జేసీబీలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పడవలను సిద్ధంగా ఉంచాలని వివరించారు. వరద బాధిత ప్రజలకు ఆహారం, సురక్షిత తాగునీరు అందించేందుకు వీలుగా కమ్యూనిటీ కిచెన్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎన్. ఆనంద్, ఆధవ్ అర్జునా, అరుణ్రాజ్, కే.ఏ. సెంగోట్టయ్యన్, టీకే. ప్రభు, ఎం. విజయ్ బాలాజీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. సాయికుమార్, డీజీపీ మహేష్ కుమార్ అగర్వాల్ తదితరులతో పాటు వర్చువల్ విధానంలో సంబంధిత జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
వారానికి రెండుసార్లు తనిఖీలు
గతంలో వరదల ముంపునకు గురైన ప్రాంతాలు , ఇతర ముంపు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను మంత్రులు, ఉన్నతాధికారుల బృందం వారానికి కనీసం రెండుసార్లు స్వయంగా తనిఖీ చేయాలని ఈసందర్భంగా సీఎం ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచిస్తూ, చైన్నె కార్పొరేషన్, చైన్నె తాగునీటి సరఫరా బోర్డు, పోలీసు, అగ్నిమాపక, ఆరోగ్య, మత్స్య, విద్యుత్ శాఖలు, మెట్రో రైలు సంస్థలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షపు నీరు త్వరగా బయటకు వెళ్లేలా జలవనరుల్లో ఆ గురప్రుడెక్క (మొక్కలను తొలగించి, డ్రైనేజీ కాలువలను పూడికతీత తీయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్డు, తాగునీటి పనులను తక్షణమే పూర్తి చేయాలన్నారుర.


