సాక్షి , చైన్నె: చేతిలో అధికారం ఉంది కదా అని ఏమైనా చేయవచ్చని టీవీకే నాయకులు భావిస్తున్నారని, ఈ ప్రభుత్వం ఎంత వేగంగా అధికారంలోకి వచ్చిందో, అంతే వేగంగా త్వరలోనే పాతాళానికి పడిపోతుందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో తాము ఇచ్చిన తీర్మానాలపై చర్చకు స్పీకర్ నిరాకరించడంతో, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉదయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుండి వాకౌట్ చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో ఎడప్పాడి పళనిస్వామి మాట్లాడారు. ఆగస్టు 12న సౌదీ అరేబియాలో ఉన్న నలుగురు తమిళ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా, ఇరాన్ సముద్రపు దొంగలు జరిపిన కాల్పుల్లో మైలాడుతురైకి చెందిన మావీరన్ (38) అనే మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడని గుర్తు చేశారు. అతని మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకురావాలని, అలాగే తీవ్రంగా గాయపడి సౌదీలో చికిత్స పొందుతున్న మిగిలిన ముగ్గురు మత్స్యకారులను కాపాడాలని గత 5 రోజులుగా శాసనసభలో దృష్టిసారించే తీర్మానం కింద తాము గొంతు విప్పుతున్నాపట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని కనీసం సభలో ప్రస్తావించడానికి కూడా స్పీకర్ అనుమతించడం లేదని, తాము దీనిపై నిరసిస్తూ వాకౌట్ చేస్తుంటే టీవీకే సభ్యులు నవ్వుతున్నారని, సున్నితత్వం ఉన్న తమిళులు ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా? అని విమర్శించారు.
పాలన లేదు.. రీల్స్ మాత్రమే:
రాష్ట్రంలో ప్రస్తుతం పాలన ఏమీ జరగడం లేదని, కేవలం ‘రీల్స్’ మాత్రమే తీసుకుంటున్నారని, వీరు ప్రజలను ఎలా కాపాడతారు? అని ప్రశ్నించారు. కర్ణాటకలో స్థానికంగా నివసిస్తున్న ముగ్గురు తమిళులను అటవీశాఖ అధికారులు కాల్చిచంపినా ఈ ప్రభుత్వం కనీసం ఖండించలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో గానీ, విదేశాల్లో గానీ తమిళులకు కష్టం వస్తే గత ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పరిష్కరించేవని,అ యితే, ప్రస్తుత ప్రభుత్వానికి అలాంటి పట్టింపు లేదని మండి పడ్డారు. ఈ ప్రభుత్వానికి తమిళుల పట్ల కనీస భావోద్వేగం, బాధ్యత లేదన్నారు. అధికారం ఉందని ఏదిపడితే అది చేయవచ్చని అనుకుంటున్నారని,. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎంత వేగంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అంతే వేగంగా పాతాళానికి పడిపోవడం ఖాయమని వ్యాఖ్యలు చేశారు.


