సాక్షి, చైన్నె: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కోయంబత్తూరు నగరంలో గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా జాతీయ జెండా ర్యాలీ నిర్వహించేందుకు కోయంబత్తూరు నగర పోలీసులను బీజేపీ నగర జిల్లా శాఖ అనుమతి కోరింది. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో, పార్టీ తరఫున చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కోయంబత్తూరులో బుధవారం ఈ జాతీయ జెండా ర్యాలీ ఘనంగా జరిగింది. కోయంబత్తూరులోని సాయిబాబా కాలనీ వద్ద నగర జిల్లా బీజేపీ అధ్యక్షుడు రమేష్ కుమార్ నాయకత్వంలో ఈ ర్యాలీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఎస్.ఆర్. శేఖర్, కామాక్షిపురం ఆధీనం పంచలింగేశ్వర స్వామి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
160 అడుగుల జెండా..
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేకంగా తయారు చేసిన 160 అడుగుల పొడవైన జాతీయ జెండాను బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేతులతో పట్టుకుని ఊరేగింపుగా తీసుకెళ్లారు.ఈ ర్యాలీ ఉత్తర కోయంబత్తూరులోని చింతామిణి ప్రాంతంలో ముగిసింది. ఈ ఊరేగింపులో వందలాది మంది పాల్గొనగా, కోర్టు ఉత్తర్వుల ప్రకారం ర్యాలీ జరగడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


