సాక్షి, చైన్నె : తమిళగ వెట్రి కళగంకు సినీ నటి రంజనా నాచియార్ బై..బై చెప్పేశారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. విజయ్పై తనకు నమ్మకం పొయిందని, అందుకే టీవీకేను వీడి డీఎంకేలో చేరినట్టు నటి రంజనా నాచియార్ ప్రకటించారు. వివరాలు.. తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం చెందిన మహిళా విభాగం ముఖ్య నాయకురాలు, నటి రంజనా నాచియార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గతంలో బీజేపీలో ఉన్న రంజనా, కొన్ని నెలల క్రితమే విజయ్ పార్టీలో చేరారు. అయితే, ఇటీవల విజయ్ వ్యక్తిగత జీవితం , పార్టీ పనితీరుపై ఆమె బహిరంగంగా విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. తాజాగా స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీవీకే పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
విజయ్పై నమ్మకం పొయింది
రంజనా నాచియార్ మాట్లాడుతూ విజయ్ పార్టీలో మహిళలకు నిరంతరం అవమానాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళను పూర్తిగా విస్మరిస్తున్నారని,. మహిళలకు రక్షణ కల్పించగలిగే ఏకై క పార్టీ డీఎంకే మాత్రమేనని తాను నమ్ముతున్నట్టు వ్యాఖ్యలు చేశారు. విజయ్ ఒక పెద్ద రాజకీయ నాయకుడిగా ఎదుగుతారనే నమ్మకం తనకు పోయిందన్నారు. అందుకే ఆ పార్టీ నుండి బయటకు వచ్చేశాను. ఎన్నికలకు కేవలం 30 రోజులే సమయం ఉన్నా, విజయ్ ఇప్పటికీ ప్రజల్లోకి రావడం లేదని, ఇకపై కూడా ఆయన బయటకు వస్తారని తాను అనుకోవడం లేదన్నారు. ఏదై నా సమస్య వస్తే విజయ్ బయటకు రారు అని, పార్టీ నాయకులకు కూడా కనిపించకుండా పారిపోతారని ఆరోపించారు. కేవ లం నలుగురు వ్యక్తులు ఉండి వేదికపై ఉపన్యాసా లు ఇస్తే పార్టీ నడపలేరని, బాధ్యతతో వ్యవహరించడమే రాజకీయం అని, అది కనిపించడం లేదన్నారు.
అయోమయంలో పార్టీ
ఓ వైపు మతతత్వ పార్టీలతో కలవమని విజయ్ చెబుతుంటే, మరోవైపు ఆధవ్ అర్జున కూటమి చర్చలు జరిగాయని అంటున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇందులో దేనిని నమ్మాలో అర్థం కావడం లేదన్నారు. ఆధవ్, జాన్ ఆరోగ్యసామి, బుస్సీ ఆనంద్లను నమ్ముకుని పార్టీ నడపవచ్చు అని విజయ్ అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి మాజీ మంత్రి కన్నన్ కుమారుడు విఘ్నేష్తో పాటుగా స్వతంత్ర ఎమ్మెల్యే అంగాలన్ కూడా డీఎంకేలో స్టాలిన్ సమక్షంలో చేరారు.


