సాక్షి, చైన్నె: మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచే ఫిక్కీ ఎఫ్ఎల్ఓ(మహిళా విభాగం) చైన్నె చాప్టర్ వార్షిక ‘చేంజ్ ఆఫ్ గార్డ్‘ (నాయకత్వ మార్పు) కార్యక్రమం చైన్నెలో ఘనంగా జరిగింది. 2025–26 సంవత్సరానికి చైర్పర్సన్గా వ్యవహరించిన నియతి ఎ. మెహతా నుండి డాక్టర్ అమ్యూల్య రావు 2026–27 సంవత్సరానికి నూతన చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పు , అటవీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియ సాహూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుప్రియ సాహూ మాట్లాడుతూ.. పర్యావరణ హితమైన ప్రపంచాన్ని నిర్మించడంలో ఫిక్కీ ఎఫ్ఎల్ఓ వంటి సంస్థలు ముందుండాలని కోరారు. చేసే ప్రతి చిన్న పని పర్యావరణంపై ప్రభావం చూపుతుందని, భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. అవుట్గోయింగ్ చైర్పర్సన్ నియతి ఎ. మెహతా మాట్లాడుతూ, తన పదవీ కాలంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. తన హయాంలో సాధించిన మైలురాళ్లపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. నూతన చైర్పర్సన్ డాక్టర్ అముల్య రావు మాట్లాడుతూ.. ఆరోగ్యం, విద్య , సమాజ అభివృద్ధి రంగాల్లో మహిళల నేతృత్వంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. మహిళా వృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు.


