
క్లుప్తంగా
అనిరుధ్ సంగీత కచ్చేరికి
హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తమిళసినిమా: యువ సంగీత కెరటం అనిరుద్ హుక్కుమ్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా సంగీత కచేరిలను నిర్వహించ తలపెట్టారు. అందులో భాగంగా చైన్నెలో ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నారు. స్థానిక సముద్ర తీర ప్రాంతం, కువత్తూర్లోని స్వర్మభూవి ప్రాంతంలో జరుగనుంది. అందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. టికెట్ల బుకింగ్ కూడా భారీ ఎత్తున జరుగుతున్నట్లు అనిరుద్ వెల్లడించారు. అయితే ఈ సంగీత కచేరిని నిర్వాహకులు కలెక్టర్ అనుమతి పొందకుండా నిర్వహిస్తున్నారని, నిర్వహణ ప్రాంతంలో వచ్చే ప్రజలకు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదని, అందువల్ల ఆ సంగీత కచేరి జరగకుండా నిషేధం విధించాలని కోరుతూ చెయ్యూర్ నియోజకవర్గం శాసనసభ్యుడు పనైయూర్ బాబు శుక్రవారం ఉదయం చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ అనిరుద్ హుక్కుమ్ పేరుతో నిర్వహిస్తున్న సంగీత కచేరీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు ఇచ్చారు. అయితే ప్రజల భద్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా మహాబలిపురం డీఎస్సీ అనుమతి పొందాలని ఆదేశాలు జారీ చేశారు.
రూ.85 లక్షలతో
అభివృద్ధి పనులకు తీర్మానం
పళ్లిపట్టు: పొదటూరుపేట టౌన్ పంచాయతీలో రూ.85 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కౌన్సిలర్ల సమావేశంలో తీర్మానం ఆమోదించారు. పళ్లిపట్టు సమీపంలోని పొదటూరుపేట టౌన్ పంచాయతీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. చైర్మన్ రవిచంద్రన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కార్యనిర్వహణాధికారి హరిహకార్తికేయన్తోపాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ముందుగా పట్టణ పంచాయతీలో ఆదాయం, ఖర్చులకు సంబంధించిన నివేదిక సమర్పించారు. అనంతరం అభివృద్ధి పనులకు సంబంధించి సభ్యులు జరిపారు. 15వ ఫైనాన్స్ నిధుల నుంచి రూ.45 లక్షల వ్యయంతో మురుగునీటి కాలువలు, రోడ్ల నిర్మాణం, ఎమ్మెల్యే నిధులు రూ.10 లక్షల వ్యయంతో అంగన్వాడీ కేంద్రం, టౌన్ పంచాయతీ నిధులు రూ.18 లక్షల వ్యయంతో వివిధ సంక్షేమ పనులు చేపట్టాలని సమావేశంలో తీర్మానం ఆమోదించారు.
గంజాయి తరలింపు కేసులో
ఇద్దరి అరెస్టు
అన్నానగర్: థాయిలాండ్ నుంచి చైన్నెకి రూ.12 కోట్ల విలువైన హైగ్రేడ్ గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు యువకులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్లైన్న్స్ విమానం చైన్నెలోని మీనంబాక్కం విమానాశ్రయానికి శుక్రవారం వేకువజామున చేరుకుంది. విమానంలో ఉన్న ప్రయాణికులను విమానాశ్రయ కస్టమ్స్ ఇంటెలిజెనన్స్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆ సమయంలో పంజాబ్కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి, తమిళనాడుకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి పర్యాటకులుగా థాయిలాండ్ను సందర్శించి చైన్నెకి తిరిగి వచ్చారు. ఇద్దరూ పెద్ద సంచులను మోసుకెళుతుండగా కస్టమ్స్ డిపార్ట్మెంట్ నిఘా అధికారులకు వారిపై అనుమానం వచ్చింది. దీంతో వారి బ్యాగులను తనిఖీ చేశారు. అందులో మొత్తం 8 పార్శిళ్లు కనిపించాయి. వారు ఆ పార్శిళ్లు తెరిచి చూడగా వాటిలో హైగ్రేడ్, గ్రేడెడ్ హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్లు గుర్తించారు. 8 పార్శిళ్లలో మొత్తం 12 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి ఉండగా గుర్తించి, స్వాధీనం చేసుకుని, వారిని అరెస్టు చేశారు. దీని అంతర్జాతీయ విలువ రూ. 12 కోట్లు ఉంటుందని తెలుస్తుంది.
నిందితులపై చర్యలు తీసుకోండి
వేలూరు: జిల్లాలోని గుడియాత్తం పట్టణానికి చెందిన కుమరన్ అనే వ్యక్తి శశికళ గురించి అసభ్యంగా మాట్లాడి సోషియల్ మీడియాలో పోస్టు పెట్టాడని, అతనిపై చర్యలు తీసుకుని, అతడిని అరెస్టు చేయాలని తిరుత్తణి నరసింహన్ కోరారు. ఈ మేరకు ఆయన అధ్యక్షతన వేలూరు ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడియాత్తం పట్టణానికి చెందిన కుమరన్ తరచూ అన్నాడీఎంకే ప్రతినిధులపై అసభ్యంగా మాట్లాడి సోషియల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, వీటిపై విచారణ జరిపి వెంటనే అతడిని అరెస్టు చేయాలని కోరారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ఆనందన్, పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి ఎల్కేఎండీ వాసు, కార్యకర్తలు, అనుచరులు ఉన్నారు.

క్లుప్తంగా

క్లుప్తంగా