
ఉన్నత విద్యకు అధిక నిధులు కేటాయించాలి
చాన్స్లర్ విశ్వనాథన్
వేలూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత విద్యకు అధిక నిధులు కేటాయించి విద్యాభివృద్ధికి దోహద పడాలని చాన్స్లర్ విశ్వనాథన్ అన్నారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీలో శనివారం 40వ స్నాతకోత్సవం వీఐటీ చాన్స్లర్ విశ్వనాథన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఐటీని గత 41 సంవత్సరాల క్రితం 180 మంది విద్యార్థులతో ప్రారంభించడం జరిగిందని ప్రస్తుతం వేలూరు, చైన్నె, అమరావతి, భోపాల్ సహా మొత్తం నాలుగు క్యాంపస్లో ప్రపంచంలోని 73 దేశాలతో పాటూ మన దేశంలోని 34 రాష్ట్రాలకు చెందిన మొత్తం 45 వేల మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారన్నారు. వీఐటీలో డిగ్రీలు సాధించిన వారు గర్వించ దగ్గ స్థాయికి వెల్లి తగిన లక్ష్యాలను సాధిస్తున్నారన్నారు. మన దేశంలో 58 వేల ఉన్నత విద్యా సంస్థలు, 1,200 యూనివర్సిటీలున్నాయన్నారు. మనం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలన్నారు. తమిళనాడు బడ్జెట్లో ఉన్నత విద్యకు 21 శాతం కేటాయించారని దీంతోనే దేశంలోనే తమిళనాడు ఉన్నత విద్యలో ముందంజలో ఉందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యకు కేవలం 2.5 శాతం మాత్రమే కేటాయించిందన్నారు. ఈ నిధులు చాలవని మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ 500 యూనివర్సిటీల జాబితాలో వీఐటీకి స్థానం లభించిందన్నారు. వీఐటీలో ఉన్నత విద్యా పథకాన్ని ప్రారంభించి నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నామన్నారు. ఇందులో 50 శాతంకు పైగా వీఐటీ ఫ్రొఫెసర్లు సాయం చేయడంతో పాటూ సంవత్సరంలో ఒక రోజు వేతనాన్ని అందరికీ ఉన్నత విద్యా పథకానికి అందజేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి మహాదేవన్ ముఖ్య అతిథిగా హాజరై అబ్దుల్ కలాం హాస్టల్ను ప్రారంభించి చెట్లునాటారు. అనంతరం పోలీస్ డీజీపీ సందీప్రాయ్ రాథోడ్తో పాటూ పలువురు పరిశోధన విభాగం విద్యార్థులకు డిగ్రీ పత్రాలను అందజేశారు. అనంతరం వివిధ కోర్సుల్లో డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు బంగారు పథకాలతో పాటూ 11,563 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ సీనియర్ అడ్మినిష్టేషన్ అధికారి శివకుమార్, వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్, జీవీ సెల్వం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంద్యా పెంటారెడ్డి, అసిస్టెంట్ వైస్ ప్రెసెడెంట్ కాదంబరి, ట్రస్టీ రమణి శంకర్, అసోసియేషన్ వైస్ చాన్స్లర్ పార్థసారథి మల్లిక్, రిజిస్టార్ జయభారతి తదితరులు పాల్గొన్నారు.

ఉన్నత విద్యకు అధిక నిధులు కేటాయించాలి