
క్లుప్తంగా
అన్నానగర్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి, తిరుప్పూర్ 15 లోని వేలంపాలయం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే తిరుమురుగన్ పూండి రింగ్ రోడ్, అశోక్ స్కూల్ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఆ రోడ్డు గుండా ఓ ఆటో వచ్చింది. అందులో ఉన్న మహిళను చూసి దిగ్భ్రాంతి చెందిన పోలీసు మహిళ కోకిల, పోలీసులు వెంటనే ఆటోను ఆపి తనిఖీ చేశారు. ఒడిశాకు చెందిన భారతి అనే మహిళను ఆమె భర్త డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడని వెల్లడైంది. ఆసమయంలోనే భారతికి ప్రసవం నొప్పులు తీవ్రమై డెలివరీకి వ్యవధిలేకుండా పోయింది. దీంతో భారతి ప్రాణాలకు ప్రమాదం ఉండటంతో నర్సింగ్ చదివిన మహిళా పోలీసు అధికారిణి కోకిల ధైర్యంగా ఆమెను ఆటోలో ఎక్కించింది. సుఖ ప్రసవం చేసింది. ఆమెకు ఓ ఆడబిడ్డ పుట్టింది. దీని తరువాత, భారతిని, బిడ్డను వెంటనే తిరుప్పూర్ ఉ ఐ ఆసుపత్రికి పంపించారు. అక్కడి వైద్యులు వారికి చికిత్స అందించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. తిరుప్పూర్ నగర పోలీసు కమిషనర్ రాజేంద్రన్, సీనియర్ పోలీసు అధికారులు, పోలీసులు, ప్రజలు భారతి ప్రాణాలను కాపాడిన మహిళా పోలీసు కోకిలను ప్రశంసించారు.
కొరుక్కుపేట: చైన్నె కొరుక్కు పేటకు చెందిన సీబీఎఫ్ సంఘ ఆధ్వర్యంలో జె. జస్టిన్ పాల్ సంగీత సారథ్యంలో డాక్టర్ వసంత బాబు రాసి స్వరకల్పన చేసిన శ్రీజయము శ్రీ అనే క్రైస్తవ భక్తి గీతం ఆవిష్కరణ శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ఇందులో విశ్వ పౌండేషన్ ప్రధాన కార్యదర్శి జడ విశ్వ వాణి, జడ సుబ్బారావు ఆవిష్కరించగా.. సువార్త గాయకుడు కె. ఆనంద్ బాబు తొలిప్రతిని అందుకున్నారు.
అన్నానగర్: సేలం జిల్లాలోని మేట్టూర్ సమీపం పుదుచంపల్లి పశ్చిమ నియాక్కరర్ వీధికి చెందిన ఆనంద్. ఇతని భార్య ప్రతిభ (30). ఈమె కుటుంబ పరిస్థితి దృష్ట్యా, వీరు కోనూర్ పంచాయతీ తాలూకాకు చెందిన మురుగన్ (39) నుంచి 2013లో రూ. 5.20 లక్షలు అప్పు తీసుకుంది. దానికి ప్రతిగా ప్రతిభ సంతకం చేసిన నాలుగు ఖాళీ ప్రామిసరీ నోట్లు తీసుకున్నారు. ఈమె రుణంపై 25 శాతం వడ్డీని లెక్కించి ఇప్పటివరకు రూ. 27 లక్షలు చెల్లించింది. అయితే, మురుగన్ మరో రూ.36 లక్షలు డిమాండ్ చేసి, ప్రదీప్ ఇంటికి వచ్చి ఆమెను బెదిరించి ఆమె కారు, ఇంటి టైటిల్ డీడ్, మోటార్ సైకిల్ ఆర్సి బుక్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లాక్కుని వెళ్లిపోయాడు. తర్వాత మురుగన్ డబ్బులు డిమాండ్ చేస్తూ ఆమెను వేధిస్తూనే ఉన్నాడు. ఈ స్థితిలో శనివారం ఆమె ఇంటికి వచ్చిన మురుగన్ ఆమెను అనుచిత పదజాలంతో దూషించి చంపేస్తానని బెదిరించాడు. వడ్డీతో బెదిరించాడని ప్రతిభ కరుమలకూడల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, కంతు వడ్డీతో బెదిరించిన మురుగన్ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నానగర్: కన్యాకుమారి జిల్లా అడవుల్లో వేటాడి కేరళలో ఏనుగు, పులి దంతాలను విక్రయించడానికి యత్నించినందుకు తమిళనాడుకు చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి 5 సెట్ల ఏనుగు దంతాలు, పులి పళ్లు, పాత ఏనుగు దంతాలు ఉన్నట్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు కన్యకుమారి జిల్లాకు చెందిన కుట్టప్పన్, నాగప్పన్, విశ్వంబరం, షాజహాన్ అని తేలింది. వారు తమిళనాడు సరిహద్దులోని మోతిరమలై, బెస్సిప్పరై అడవుల నుంచి అడవి జంతువులను వేటాడి, దంతాలను కేరళకు అమ్మకానికి తీసుకువచ్చారని వెల్లడైంది.
యువకుడి
దారుణ హత్య
తిరువొత్తియూరు: మద్యం మత్తులో జరిగిన గొడవలో ఓ యువకుడిని వ్యక్తి బండరాయితో కొట్టి చంపాడు. ఈ ఘటన సేలంలో జరిగింది. సేలం సమీపంలోని కాడయంపట్టి కొంగరపట్టి మేల్కాడ ప్రాంతానికి చెందిన పీటర్ కుమారుడు జోసఫ్ (27). ఇతని పక్కంటిలో జార్జ్ (45) ఉంటున్నాడు. వీరిద్దరూ బంధువులు. ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉంది. ఇందులో జోసఫ్, ప్రతిరోజూ మద్యం తాగి జార్జ్ ఇంటి ముందు నిలబడి గొడవ చేసేవాడు. శుక్రవారం రాత్రి కూడా జోసఫ్ గొడవ చేస్తుండడంతో ఆగ్రహించిన జార్జ్ అతన్ని నిలదీశాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కిందపడిన జోసెఫ్ తలపై బండరాయి వేశాడు. జోసఫ్ అక్కికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని జార్జ్ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.