
అమిత్ షాతో నైనార్ భేటీ
సాక్షి, చైన్నె : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం ప్రపథమంగా మంగళవారం నైనార్ నాగేంద్రన్ ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపి నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీబలోపేతానికి సంబంధించిన వ్యూహాల గురించి నైనార్కు మంత్రులు వివరించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకేతో కూటమి ఏర్పడిన దృష్ట్యా, వారితో కలిసి పార్టీ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వపథకాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, పార్టీలోని సీనియర్లను కలుపుకుని వెళ్లాలని, ప్రధానంగా దక్షిణ తమిళనాడులోని జిల్లాల మీద ప్రత్యేక దృిష్టి సారించాలన్న సూచనలు చేసినట్టు సమాచారం. కాగాపార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం పెద్దల ఆశీస్సలు పొందేందుకు ఢిల్లీకి వచ్చినట్టు, వారి సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతామని నైనార్ పేర్కొన్నారు.
క్రీడా వర్సిటీ ఛాన్సలర్గా సీఎం
సాక్షి, చైన్నె: క్రీడా వర్సిటీకి ఛాన్సలర్గా సీఎం వ్యవహరిస్తారని, వీసీ నియామకం, తొలగింపు అన్ని అధికారాలు ఛాన్సలర్కే వర్తించే విధంగా అసెంబ్లీలో చట్ట సవరణ ముసాయిదా దాఖలైంది. సుప్రీంకోర్టు తీర్పుతో పది వర్సిటీల ముసాయిదాలకు ఆమోదం, చట్టబద్ధత కల్పించే విధంగా గెజిట్లో వివరాల ప్రకటన విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో మంగళవారం అసెంబ్లీలో క్రీడల మంత్రి, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఓ ముసాయిదా ప్రవేశ పెట్టారు. వర్సిటీలకు ఛాన్సలర్గా సీఎం ఉంటారని పేర్కొంటూ, క్రీడావర్సిటీ ప్రస్తావన చేశారు. వర్సిటీల వీసీల నియామకం, తొలగింపు తదితర అన్ని అధికారాలు ముఖ్యమంత్రికే ఉంటాయని పేర్కొంటూ దాఖలైన ఈ చట్ట సవరణ ముసాయిదాతోపాటుగా చివరి రోజున పలు ముసాయిదాలు అసెంబ్లీ ఆమోదాన్ని పొందాయి. ఇదిలా ఉండగా, కాగ్ నివేదిక అసెంబ్లీకి చేరగా ఇందులో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి అధిక ఫీజుగా రూ.3.14 కోట్లు అదనంగా వసూలు చేసినట్టు పేర్కొనడం గమనార్హం.
వారి పిటిషన్లు తిరస్కరించండి
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే రెండాకాల గుర్తు వివాదంపై ఎన్నికల కమిషన్ ముందు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం తన వాదనను వినిపించారు. అన్నాడీఎంకే నుంచి తొలగించిన వారికి పార్టీతో సంబంధం లేదని, వారి పిటిషన్లు తిరస్కరించాలని కోరారు. అన్నాడీఎంకేలో వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల మద్రాసు హైకోర్టులో విచారణలో ఉన్న అన్నాడీఎంకే అంతర్గాత విభేదాలు, సమరం, రెండాకుల వివాదాల వ్యవహారం విచారణ ముగిసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహరాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కోర్టులోకి న్యాయమూర్తులు నెట్టారు. ఈ సమయంలో అన్నాడీఎంకే – బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఇక రెండాకు సమస్యకు అడ్డుతొలగినట్టే అన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అనుగుణంగానే తాజా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్లో విచారణ మొదలైంది. మంగళవారం అన్నాడీఎంకే తరపున రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం హాజరై వాదన వినిపించారు. ఈ పిటిషన్ వేసిన వారెవ్వరు అన్నాడీఎంకేలో లేరని, వారందర్నీ తొలగించి ఉన్నట్టు వివరిస్తూ ఈ పిటిషన్ విచారణను తోసి పుచ్చాలని కోరారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ చెఫ్ దామోధరన్కు సత్కారం
కొరుక్కుపేట: సౌత్ ఇండియా చెఫ్స్ అసోసియేషన్ (సికా ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ కల్నరీ అసొసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత చెఫ్ డాక్టర్ కె దామోధరన్ను మంగళవారం చైన్నెలో ఘనంగా సత్కరించుకున్నారు. చైన్నె ఆలందూర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ కల్నరీ అసోసియేషన్స్ (ఐఎఫ్సీఏ) అధ్యక్షులు చెఫ్ మంజిత్ సింగ్ గిల్, సికా జనరల్ సెక్రటరీ చెఫ్ సీతారాం ప్రసాద్ ఇంకా సికా, ఐఎఫ్సిఏ బోర్డు సభ్యలతో పాటు తమిళనాడు ప్రభుత్వ టీడీడీసీ, ఐటీడీసీ అధికారులు, ప్రముఖులు పాల్గొని చెఫ్ దామోధరన్ను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు . ఈ సందర్భంగా చెఫ్ దాము తన స్పందనను తెలియజేస్తూ దేశంలోని అత్యుత్తమ పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ దక్కడం, రాష్ట్రపతి ముర్ము చేతులమీదుగా అందుకోవడం చాలా గర్వంగా ఉందని తెలిపారు . వంటల కళకు తన జీవితాన్నే అంకితం చేశానని అన్నారు . చేసే పని చిన్నది పెద్దది అని చూడకుండా యువత తన పనిని సమర్థవంతంగా, నమ్మకంతో చేస్తే ఏరంగంలోనైనా గుర్తింపు ,గౌరవం దక్కుతుందనేది తానే నిదర్శనం అని అభిప్రాయపడ్డారు.

అమిత్ షాతో నైనార్ భేటీ