
మంత్రిగా మనో తంగరాజ్ ప్రమాణ స్వీకారం
● మళ్లీ పాడి పరిశ్రమల శాఖ అప్పగింత
సాక్షి, చైన్నె: రాష్ట్ర మంత్రిగా పద్మనాభ పురం ఎమ్మెల్యే మనో తంగరాజ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు. వివరాలు.. డీఎంకే ప్రభుత్వం 2021లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎం స్టాలిన్ నేతృత్వంలో 33 మందితో కూడిన మంత్రి వర్గం ఏర్పాటైంది. 2022లో తొలి సారిగా మంత్రి వర్గంలో మార్పు చేశారు. 2023లో అయితే, ఏకంగా మూడు సార్లు మంత్రి వర్గంలో మార్పులు జరిగాయి. ఓ సారి మార్పుల సమయంలో కొత్తగా కేబినెట్లోకి స్టాలిన్ వారసుడు ఉదయ నిధి, మరోసారి మార్పు సమయంలో సీనియర్ నేత టీఆర్బాలు వారసుడు టీఆర్బీ రాజా కెబినెట్లోకి వచ్చారు. గత ఏడాది చివర్లో కూడా మంత్రి వర్గంలో మార్పులు జరిగాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా మంత్రి వర్గంలో మార్పు అనివార్యంగా మారింది. మనీ లాండరింగ్ కేసులో బెయిలా.. మంత్రి పదవినా? అని సెంథిల్ బాలాజీని సుప్రీం కోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన మంత్రి పదవి కోల్పోక తప్పలేదు. ఆయన్ని మంత్రిగా తప్పించిన సీఎం స్టాలిన్ ఆయన చేతిలో ఉన్న విద్యుత్ శాఖను రవాణా మంత్రి శివశంకర్కు అదనంగాఅప్పగించారు. మరోశాఖ ఎకై ్సజ్ పదవిని గృహ నిర్మాణశాఖ మంత్రి ముత్తు స్వామికి అందజేశారు. ఇక, మహిళలు, శైవం, వైష్ణవం గురించి వివాదాస్పదన వ్యాఖ్యలు చేసిన సీనియర్ మంత్రి పొన్ముడిని పదవి నుంచి తప్పించారు. ఆయన చేతిలో ఉన్న అటవీ శాఖను పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజకన్నప్పన్కు అప్పగించారు. ఇక గత ఏడాది చివర్లో జరిగిన మార్పు సమయంలో మంత్రి పదవిని కోల్పోయిన పద్మనాభ పురం ఎమ్మెల్యే మనో తంగరాజ్కుమరో మారు అవకాశం కల్పించారు. ఆయనకు గతంలో వ్యవహరించిన పాడి పరిశ్రమల శాఖను మళ్లీ అప్పగించారు. ఈ తాజా మార్పులో గతంలో మంత్రి పదవిని కోల్పోయి మళ్లీ పదవి చేజిక్కించుకుని, మళ్లీ కోల్పోయిన వారుగా సెంథిల్ బాలాజీ, పొన్ముడి జాబితాలో చేరారు. గతంలో మంత్రి పదవి కోల్పోయి తాజాగా మళ్లీ దక్కించుకున్న జాబితాలోకి మనో తంగరాజ్ చేరారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు రాజ్ భవన్లో మనో తంగరాజ్ ప్రమాణ స్వీకరం జరిగింది. సీఎం స్టాలినన్్ కొన్ని నెలల తర్వాత రాజ్ భవన్లో అడుగు పెట్టారు. గవర్నర్ ఆర్ఎన్ రవితో చిరునవ్వులతో పలకరిస్తూ కనిపించారు. మనో తంగరాజన్తో గవర్నర్ రవి ప్రమాణ స్వీకరం చేయించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారంచేసిన మనో తంగరాజ్కు గవర్నర్, సీఎం పుష్పగుచ్చాలను అందజేసి శుభకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు.