
నిరసనల మహానాడు
● ఊటీలో ప్రారంభం ● అధ్వాన్నంగా పాఠశాల విద్య ● గవర్నర్ వ్యాఖ్య ● రాజకీయ శాసన పరిరక్షణలో కీలకంగా గవర్నర్ ● ఉప రాష్ట్రపతి కితాబు ● దూరంగా ప్రభుత్వ వర్సిటీల వీసీలు
సాక్షి, చైన్నె: నల్ల జెండాల నిరసనలతో ఊటీ వేదికగా శుక్రవారం వీసీల మహానాడు ప్రారంభమైంది. ఈ మహానాడుకు వ్యతిరేకంగా పలు సంఘాలు, పార్టీలు నిరసనలు హోరెత్తించాయి. ప్రభుత్వ వర్సిటీల వీసీలు, ప్రతినిధులు గైర్హాజరైనా ఈ మహానాడు నిర్వహణలో గవర్నర్ రవి ఏమాత్రం తగ్గలేదు. ఈ కార్యక్రమం వేదికగా రాష్ట్రంలో అమల్లో ఉన్న పాఠశాల విద్య అధ్వాన్నంగా ఉందని గవర్నర్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ శాసనాల పరిరక్షణలో గవర్నర్ కీలకంగా శ్రమిస్తున్నట్టు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ కొనియాడారు.
రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి నేతృత్వంలో ప్రతి సంవత్సరం నీలగిరి జిల్లా ఊటీ వేదికగా గవర్నర్ల మహానాడు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ఏడాది కూడా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో వర్సిటీలకు సంబంధించిన పది ముసాయిదాల వ్యవహారంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని 21 వర్సిటీలు ప్రభుత్వ గుప్పెట్లోకి చేరాయి. వీటికి చాన్స్లర్గా సీఎం స్టాలిన్ ఉంటారని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ నేతృత్వంలో ఊటీలో వీసీల మహానాడు నిర్వహణకు సిద్ధం కావడంతో తమిళ పార్టీల్లో వ్యతిరేకత మొదలైంది. కాంగ్రెస్, పెరియార్ ద్రావిడ కళగం, ద్రావిడర్ తమిళగం, తందై పెరియర్ ద్రావిడ కళగం పార్టీలు సంఘాలు, ఈ మహానాడుకు వ్యతిరేకంగా పోరాటాలకు పిలుపునిచ్చాయి. దీంతో ఊటీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మహానాడుకు వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం నుంచి అనేక చోట్ల నిరసనలు చోటుచేసుకున్నాయి. ఊటీలోని రాజ్భవన్ వైపుగా దూసుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. నిరసనలు ఓ వైపు సాగితే, మరో వైపు రెండు రోజుల మహానాడు నిఘా నీడలో ప్రారంభమైంది.
గవర్నర్కు కితాబు
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ మాట్లాడుతూ రాజకీయ శాసనాలను పరిరక్షించడంలో గవర్నర్ రవి కీలక సేవలు అందిస్తున్నారన్నారు. విద్యా సంస్థలకు అనుకూలంగా విద్యా అంశాలు, అవకాశాలు ఉండాలని వ్యాఖ్యానించారు. దేశ ప్రగతిలో విద్య విభాగం కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. తాను సైతం చదువుకోవడం ద్వారా మంచి పదవిలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈసందర్భంగా కశ్మీర్లో తీవ్ర వాద దాడులను గుర్తుచేస్తూ, ఈ దాడులు ప్రమాదకరంగా మారాయని వ్యాఖ్యలు చేశారు. దాడుల్లో దేశ ప్రగతిని అడ్డుకోలేరన్నారు. వర్సిటీలు విద్యావ్యవస్థకు మార్గదర్శకంగా ఉండాలని, విద్యాపరంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవశ్యమన్నారు. ఉన్నత విద్య అందరికీ అందాలని ఆకాంక్షించారు. ముందుగా ఊటీకి వచ్చిన ఉప రాష్ట్రపతికి మంత్రి స్వామినాథన్, ఎంపీ రాజా ఆహ్వానం పలికారు.

నిరసనల మహానాడు