
కిలాంబాక్కానికి మెట్రో!
● ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ● విమానాశ్రయం నుంచి విస్తరణ పనులు
మెట్రో రైలు
సాక్షి, చైన్నె: చైన్నె శివారులోని కిలాంబాక్కంకు మెట్రో రైలు సేవలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధ్యా అసాధ్య నివేదిక ఆధారంగా విమానాశ్రయం నుంచి విస్తరణ పనులు జరగనున్నాయి. వివరాలు.. చైన్నె కోయంబేడు బస్టాండ్కు ప్రత్యామ్నాయంగా నగర శివారులలో సబర్బన్ బస్ టెర్మినల్స్పై సీఎండీఏ దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో మాధవరం సబర్బన్ బస్ టెర్మినల్ ఉపయోగంలోకి వచ్చేసింది. అలాగే, పూందమల్లి సమీపంలో మరో సబర్బన్ టెర్మినల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
దక్షిణ తమిళనాడు వైపుగా వెళ్లే బస్సుల కోసం కిలాంబాక్కం బ్రహ్మాండ టెర్మినల్ రూపుదిద్దుకుంది. ఇక్కడి నుంచి సేవలు విస్తృతం చేశారు. ఈ బస్టాండ్కు కూత వేటు దూరంలోని వరదరాజపురంలో ఆమ్నీ బస్ టెర్మినల్ కూడా రూపుదిద్దుకుంది. అలాగే కిలాంబాక్కం బస్టాండ్ ఎదురుగా వండలూరు – ఊరపాక్కం మధ్యలో రూ. 20 కోట్లతో రైల్వే స్టేషన్ ఏర్పాటు పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కిలాంబాక్కంకు నగర వాసులు త్వరితిగతిన చేరుకునేందుకు వీలుగా మెట్రో రైలు సేవలకు సిద్ధమయ్యారు.
మెట్రో సేవకు గ్రీన్ సిగ్నల్
రాజధాని నగరం చైన్నెలో ఫేజ్ – 1 పనులు ముగియడంతో విమానాశ్రయం నుంచి కోయంబేడు మీదుగా సెంట్రల్కు, సెయింట్థామస్ మౌంట్ – ఆలందూరు – సెంట్రల్మీదుగా విమ్కో నగర్కు మెట్రో రైలు సేవలు జరుగుతున్నాయి. ఈ సేవలకు అమిత స్పందన రావడంతో ఫేజ్ 2లో మరో మూడు మార్గాలుగా మాధవరం – సిరుచ్చేరి, మాధవరం – షోళింగనల్లూరు, పూందమల్లి – లైట్ హౌస్లను ఎంపిక చేసి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ రైళ్ల సేవల నేపథ్యంలో నగర వాసులు త్వరితగతిన కిలాంబాక్కం సబర్బన్ బస్ టర్మినల్కు చేరుకునేందుకు వీలుగా మెట్రో సేవలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం విమానాశ్రయం వరకు మెట్రో సేవలు ఉన్నాయి. ఇక్కడి నుంచి పల్లావరం, క్రోంపేట, తాంబరం, ఇరుంబలియూరు, పెరుంగళత్తూరు, వండలూరు మీదుగా కిలాంబాక్కంకు మెట్రో సేవలకు సాధ్యా అసాధ్య నివేదికను అధికారులు సిద్ధం చేశారు. విమానాశ్రయం నుంచి పూర్తిగా వంతెన మార్గంలో కిలాంబాక్కంకు 15.46 కి. మీ దూరం రైలు సాగే రీతిలో రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. ఈ మార్గంలో మొత్తం 13 రైల్వే స్టేషన్లు రానున్నాయి.
ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం పనులకు ఆమోద ముద్ర వేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో మెట్రో యాజమాన్యం పనులపై దృష్టి పెట్టనున్నది. విమానాశ్రయం – వండలూరు వరకు అనేక వంతెన రోడ్డు మార్గాలు ఉన్నాయి. వీటికి ఎలాంటి ఇబ్బంది అన్నది కలుగకుండా వీటికి ఆనుకునే నిర్మాణాలు మరింత ఎత్తుగా చేపట్టడంతో పాటూ ఇతర ప్రాంతాలలో స్థల సేకరణ ప్రక్రియకు సంబంధించిన కసరత్తులలో మెట్రో యాజమాన్యం నిమగ్నం కానుంది. ఈ విస్తరణ పనులకు అంచనా వ్యయంగా సుమారు రూ. 4 వేల కోట్లుగా నిర్ణయించారు.