● ఆంధ్రా కోస్తా ప్రాంతం వైపు పయనం
సాక్షి, చైన్నె: బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం గురువారం తీవ్రంగా బలపడింది. ఇది వాయువ్య దిశగా కదులుతుండగా, ప్రస్తుతం పశ్చిమ మధ్య, ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఇది ప్రబలంగా ఉంది. శుక్రవారం సాయంత్రం ఇది తీవ్ర అల్పపీడనంగా మారినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం శుక్రవారం సాయంత్రం వెల్లడించింది. ఆ తర్వాత 24 గంటల్లో అది ఉత్తర ఈశాన్య దిశగా పయనించి మధ్య బంగాళాఖాతం మీదుగా ఆవరించే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు తీర ప్రాంతం నుంచి ఆంధ్రా తీర ప్రాంతం వైపు వెళ్లవచ్చునని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. చైన్నె, శివారు ప్రాంతాల్లో ఆకాశం మేఘామృతమై ఉంటుంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కాగా తమిళనాడులో గురవారం ఉదయం 8.30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5.30 గంటల వరకు తిరువారూరులో అత్యధికంగా 5.9 సెంమీల వర్షపాతం నమోదైంది. ఎన్నూర్ పోర్టులో 4.8 సెంమీ, కోవిల్పట్టిలో 1.3 సెంమీల వర్షపాతం నమోదైందని వెల్లడించారు.