
పెట్టుబడుల మహానాడులో ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్
‘వ్యాపారాభివృద్ధికి అపార అవకాశాలు, మౌలిక సదుపాయాలు ఉన్న తమిళనాడు పారిశ్రామిక వేత్తలకు స్వర్గధామం’ అని సీఎం స్టాలిన్ అన్నారు. స్పెయిన్ పర్యటనలో ఉన్న ఆయన పెట్టుబడిదారులతో మంగళవారం వరుస భేటీలు నిర్వహిస్తూ ముందుకు సాగారు.
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో పెట్టుబడులు భారీగా పెట్టేందుకు తరలి రావాలని స్పెయిన్ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు సీఎం ఎంకే స్టాలిన్ పిలుపు నిచ్చారు. పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా సీఎం స్టాలిన్ విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్కు సీఎం హాజరయ్యారు. పారిశ్రామిక వేత్తలు, వర్తక సంఘాల ప్రతినిధులు, పెట్టుబడి దారులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. తమిళనాడులోని వనరులు, రవాణా సౌకర్యాలు, హార్బర్లు, విమానాశ్రయాలు తదితర అంశాలను విశదీకరించారు. అనంతరం స్పానిష్ వర్తక సంఘాలతో కలసి తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల మహానాడులో సీఎం ప్రసంగించారు.
అన్నింటికీ అనుకూలం..
తమిళనాడు అన్నింటికీ అనుకూలం అని సీఎం వ్యాఖ్యనించారు. ఆహ్లాదకర మైన వాతావరణమే కాకుండా.. మౌలిక సదుపాయాలు కల్పనలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఇప్పటికే గుర్తింపు పొందిందని వివరించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో దక్షిణాన ఉన్న తమిళనాడులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని గుర్తు చేశారు. మహాకవి తిరువళ్లువర్ రచించిన తిరుక్కురల్ ప్రపంచంలోని 200 భాషలలో తర్జుమా చేయబడిందని వివరించారు. స్పెయిన్ ఫుట్బాల్కు ప్రసిద్ధి చెందిన దేశంగా పేర్కొంటూ, ఇక్కడి కళాత్మకతను చూస్తుంటే, తమిళనాడులోని సంస్కృతి సంప్రదాయాలు, అద్భుత ప్రకృతి దశ్యాలను గుర్తు చేయాల్సిన అవసరం వస్తోందని పేర్కొన్నారు.
స్పానిష్ తరహాలోనే తమిళం కూడా..
ప్రపంచంలో చాలాచోట్ల స్పానిష్ భాషను మాట్లాడుతున్నారని గుర్తు చేస్తూ, తమిళం కూడా ప్రపంచ దేశాలలో విస్తరించి ఉందని పేర్కొన్నారు. తమిళనాడు, స్పెయిన్ మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని, ఇక్కడి బుల్ ఫైటింగ్ తరహాలో తమ రాష్ట్రంలో జల్లికట్టు సంప్రదాయ, సాహస క్రీడగా బాసిళ్లుతోందని తెలిపారు. జల్లికట్టు కోసం తాము ప్రత్యేక స్టేడియం నిర్మించామని భవిష్యత్తులో తమిళనాడుకు వచ్చి ఒక్కసారైనా జల్లికట్టును వీక్షించాలని పిలుపు నిచ్చారు. యూరోపియన్ యూనియన్లో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న స్పెయిన్లోని పెట్టుబడిదారులు తమ రాష్ట్రానికి రావాలని, పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకోవాలని కోరారు. గెస్టాంప్, కామెజా, రోకా, అర్బాసర్, ఇంక్టీమ్, అంపో ప్రధాన స్పానిష్ పాపేజా, అర్బినాక్స్, కార్లాన్ సంస్థలు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి తమిళనాడులో తమ సంస్థల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, జపాన్, యూఎస్, యూకే, కొరియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, సింగపూర్, తైవాన్లలోని పెట్టుబడి దారులు పెద్దఎత్తున తమిళనాడులో పరిశ్రమలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. వాహనాలు, ఎలక్ట్రిక్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, తోలు వస్తువులు, పునరుత్పాదక శక్తి, సాంకేతికత, సమాచార వ్యవస్థ, వైద్య సేవల రంగంలో తమిళనాడు అగ్రగామిగా ఉందని తెలిపారు. ఏరోస్పేస్, రక్షణ, బయోసైన్స్, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలలో స్పెయిన్ పెట్టుబడులు ఎక్కువగా వియోగించేందుకు అవకాశం ఉందన్నారు. వనరులు, సౌకర్యాలు, అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమిళనాడులోకి పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో మంత్రి టీఆర్బీ రాజ, స్పెయిన్లోని భారత రాయబారి దినేష్ పట్నాయక్, స్పెయిన్ ఆర్థిక, వాణిజ్య విభాగం అధ్యక్షుడు, డైరెక్టర్లు, స్పానిష్ చాంబర్ ఆఫ్ కామర్స్ అంతర్జాతీయ డైరెక్టర్లు, స్పానిష్.. ఇండియన్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
న్యూస్రీల్
పారిశ్రామిక వేత్తల సమావేశంలో సీఎం స్టాలిన్ స్పష్టీకరణ
స్పెయిన్లో ముఖ్యమంత్రి బిజీబిజీ

సీఎం స్టాలిన్కు స్వాగతం పలుకుతున్న స్పెయిన్ పారిశ్రామిక వేత్తలు

టీఎన్పీఎస్సీ కార్యాలయం