ట్రైలర్కు రజనీ అభినందనలు
తమిళసినిమా: 55 ఏళ్ల సినీ పయనంలో 250 చిత్రాలకు పైగా చిత్రాలు చేసిన అనుభం గడించిన సీనియర్ దర్శకుడు వీసీ.గుహనాథన్. ఈయన ఎంజీఆర్, శివాజీగణేశన్ చిత్రాలకు కథలను అందించారు. రజనీకాంత్ హీరోగా రెండు సూపర్ హిట్ చిత్రాలతో పాటు మొత్తం 25 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా ఈయన రాసిన 275 కథతో రూపొందుతున్న చిత్రం కావీ ఆవీ నడువల దేవి. ఏవీఎం చిత్రమాల కంబైన్స్ సమర్పణలో మనోన్స్ సినీ క్రియేషన్స్ పతాకంపై ఆరూరన్, జయగుహనాథన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళమణి దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు అమన్, ప్రియాంక జంటగా నటిస్తున్న ఇందులో యోగిబాబు, రిత్విక, తంబిరామయ్య, నాన్ కడవుల్ రాజేంద్రన్, ఇమాన్ అన్నాచ్చి ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. శ్రీకాంత్దేవా సంగీతాన్ని, గణేశ్ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కథా రచయిత వీసీ.గుహనాథన్ పేర్కొంటూ తాను తాను రాసిన 275 కథతో రూపొందుతున్న చిత్రం ఇదని చెప్పారు. 55 ఏళ్లుగా సినీ రంగంలో ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూనే ఉంటున్నానని చెప్పారు. అలా వినోదాన్ని జోడించి రాసిన క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం ఇదని తెలిపారు. చిత్ర ట్రైలర్ను చూసిన రజనీకాంత్ అభినందించినట్లు చెప్పారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని గుహనాథన్ తెలిపారు.
కావీ ఆవీ నడువుల దేవి చిత్ర ట్రైలర్ను
తిలకిస్తున్న రజనీకాంత్