
ఆర్ఎస్ఎస్ ర్యాలీ
సాక్షి, చైన్నె : ఆర్ఎస్ఎస్ ర్యాలీకి 12 రకాల నిబంధనలు విధించారు. రాష్ట్రంలో సుప్రీంకోర్టు నుంచి అనుమతి పొంది మరో ర్యాలీ నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఈనెల 16న 45 చోట్ల ర్యాలీ నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ నిర్ణయించింది. ఇందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. చైన్నెలో రెండు చోట్ల ఈ ర్యాలీ జరగనుంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనేక నిబంధనలు విధించారు. డీజీపీ శైలేంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు 12 కట్టుబాట్లు తప్పనిసరిగా అమలయ్యే విధంగా శుక్రవారం ఆదేశాలు వెళ్లాయి.
ర్యాలీ, సభలో వ్యక్తిగతం, కులమతాలకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. దేశ పరువుకు భంగం కలిగించే చర్యలకు పాల్పడరాదు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలిగించకుండా ర్యాలీ నిర్వహించాలి. ర్యాలీలో పాల్గొనే వారు ఆయుధాలు, కర్రలు చేతబట్టి ముందుకు వెళ్లేందుకు వీలు లేదు. ర్యాలీలో పాల్గొనే వారి కోసం తాగునీరు, కెమెరాలు, అగ్నినిరోధక పరికరాలు, ఇలా అన్ని రకాల ఏర్పాట్లను నిర్వాహకులు చేసుకోవాలి. ఎంపిక చేసిన , అనుమతి ఇచ్చిన మార్గాలలో ఎడమ వైపు మాత్రమే ర్యాలీ జరగాలి. అనుమతి ఇచ్చిన రహదారిలోని నాలుగు భాగాలలో ఓ భాగం మాత్రమే ర్యాలీకి ఉపయోగించుకోవాలి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ర్యాలీలో ఉన్న వారిని పర్యవేక్షించేందుకు స్వచ్ఛంద సేవకులను నియమించుకోవాలని సూచించారు.