కోదాడ రూరల్ : నేరాల అదుపు, ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రణాళికతో పనిచేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. గురువారం కోదాడ పట్టణంలోని డీఎస్పీ, ట్రాఫిక్ పోలీసు కార్యాలయాల్లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్ల పనితీరుపై పర్యవేక్షణ చేస్తూ సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని డీఎస్పీకి తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, రహదారుల వెంట ఉన్న హోటళ్లు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని చోట్లా సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, అవి నేరాల నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో ఎక్కువ భాగం అంతర్ రాష్ట్ర సరిహద్దు ఉందని, ఆయా ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. వరకట్నం, అట్రాసిటీ, మైనర్లపై వేధింపులు, తీవ్రమైన చీటింగ్ కేసులకు డీఎస్పీయే దర్యాప్తు అధికారిగా ఉంటారని, ఇలాంటి కేసుల్లో పురోగతి సాధించాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, డివిజన్ పరిధిలోని సీఐలు కె.శివశంకర్, చరమందరాజు, రామకృష్ణారెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, ఎస్ఐలు నవీన్, మోహన్, స్టోర్ ఆర్ఎస్ఐ అఖిల్, సిబ్బంది అంజన్రెడ్డి, శేఖర్రెడ్డి, సీసీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ స్టేషన్ తనిఖీ
పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సిబ్బంది తగు చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. డ్రంకెన్ డ్రైవ్, ఎన్ఫోర్స్మెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. ‘ఆపరేషన్ రోప్’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై, మైనర్ల డ్రైవింగ్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


