సూర్యాపేట అర్బన్ : ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పని చేయాలని, నాయకుల స్వప్రయోజనాల కోసం అలైన్మెంట్ మార్చడం సరికాదని ఐద్వా రాష్ట్ర జనరల్ సెక్రటరీ మల్లు లక్ష్మి అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన కోసం అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో నిర్వహిస్తున్న దీక్షలు గురువారం 14వ రోజుకు చేరుకున్నాయి. ఐద్వా ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ఆమె ఈ దీక్షలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మొదటి అలైన్మెంట్ ప్రకారం జాతీయ రహదారి వెంట బుల్లెట్ ట్రైన్ను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుంద న్నారు. 40 రోజులుగా సూర్యాపేట, నకిరేకల్, కోదాడ, చౌటుప్పల్ ప్రాంతాల్లో జరుగుతున్న బుల్లెట్ ట్రైన్ దారిమళ్లింపు వ్యతిరేక ఉద్యమాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజా ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు. బుల్లెట్ ట్రైన్ను హైవే వెంటే ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జ్యోతి, వెంకటమ్మ, సైదమ్మ, రజిత, రమాదేవి, విజయలక్ష్మి, నాగమణి, కిజాబీ, లక్ష్మమ్మ, సుభద్ర, అమృతమ్మ, జానమ్మ పాల్గొన్నారు.


