మేళ్లచెరువు : కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని, వారికి న్యాయం చేసే వరకు పోరాటం ఆగబోదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం పులిచింతల జెన్కో విద్యుత్ కేంద్రం వద్ద నిరాహర దీక్ష చేస్తున్న కార్మికులకు మద్దతు తెలిపి మాట్లాడారు. 16 సంవత్సరాలుగా జెన్కోలో పనిచేస్తున్న కార్మికులను తొలగించడం సరికాదన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఆర్టీజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్మికులు నాలుగు రోజులుగా నిరాహరదీక్ష చేస్తున్నా పట్టించుకోక పోవడం సరికాదని, వెంటనే యాజమాన్యం స్పందించి వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ఎస్ఈని కలిసి కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోటగిరి వెంకటనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శ్రీను, సోమయ్య గౌడ్, వట్టెపు సైదులు తదితరులు పాల్గొన్నారు.


