సూర్యాపేట : అంధుల గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వంగవీటి రామారావు కోరారు. గురువారం సూర్యాపేటలోని జిల్లా గ్రంథాలయంలో అంధుల గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రంథాలయంలో అంధులు బ్రెయిలీ లిపితో చదువుకునేందుకు సుమారు 50మందికి సరి పోయే విధంగా స్పీకర్లు, రెండు కంప్యూటర్లు, రామాయణం, భాగవతం, 5నుంచి 10 తరగతుల పుస్తకాలు, ఇతర పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సూర్యాపేటలో అంధుల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడంతో సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి బి బాలమ్మ, అసిస్టెంట్ లైబ్రేరియన్ శ్యాంసుందర్ రెడ్డి, శ్రవణ్, సిబ్బంది సజన, భవాని, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి
సూర్యాపేట అర్బన్: జిల్లా కేంద్రంలోని కిరాణా మర్చంట్ హాల్లో ఈ నెల 14, 15వ తేదీల్లో నిర్వహించనున్న ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నర్సయ్య కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్లో టీయూసీఐ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి గోగుల వీరబాబు, కుమ్మరి వెంకట్ నారాయణ, మూడ్ వీరన్న, పవన్, సాయి, నరేష్, సాయిబాబా, కిషోర్ పాల్గొన్నారు.
ఇంటర్న్షిప్ పూర్తిచేసిన విద్యార్థులకు అభినందన
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీకి చెందిన మేనేజ్మెంట్ విద్యార్థులు ఇండియా పేమెంట్స్ బ్యాంకులో 45 రోజుల ఇంటర్న్షిప్ పూర్తిచేసి రావడం అభినందనీయమని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఇంటర్న్షిప్ పూర్తి చేసిన విద్యార్థులను గురువారం యూనివర్సిటీలో ఆయన అభినందించి మాట్లాడారు. బ్యాంకింగ్ సేవలను వినియోగదారులకు అందించడం, మార్కెటింగ్, డిజిటల్ బ్యాంకింగ్, అవగాహన కార్యక్రమాలు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్లు, వీధి వ్యాపారుల రుణ సదుపాయాలు తదితర అంశాలపై విద్యార్థులు శిక్షణ పొందారని పేర్కొన్నారు. సబీనా హెరాల్డ్, విద్యార్థులు ఉప్పరి మహేష్, నవీన్ పాల్గొన్నారు.


