భానుపురి (సూర్యాపేట) : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా, సమన్వయంతో అమలు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ సీతారామారావుతో కలిసి జిల్లా అధికారులతో దిశానిర్దేశం నిర్వహించారు. అనంతరం ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వార్డు అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 6 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 99 రోజుల కార్యాచరణ గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఐదు దశల్లో అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శిరీష, సీపీఓ యాదగిరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి
హుజూర్నగర్ : హుజూర్నగర్లోని మోడల్ హౌసింగ్ కాలనీలో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల్లో నిర్మిస్తున్న మోడల్ హౌసింగ్ కాలనీలోని ఇళ్ల బ్లాకులు, అంతర్గత రోడ్లు, సీఎం సభాస్థలిని, పార్కింగ్ సౌకర్యం తదితరాలను ఆయన పరిశీలించారు. పెండింగ్ పనులను వారంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల రెండవ వారంలో సీఎం రేవంత్ రెడ్డి కాలనీని ప్రారంభిస్తారని తెలిపారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ సిద్ధార్థ, ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లిఖార్జున్ రావు, తహసీల్దార్ కవిత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఉన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్


