స్వర్ణోత్సవ సమ్మేళనం.. మది నిండా సంతోషం
సూర్యాపేట టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సమ్మేళనం నిర్వహించారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1973–75 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ బైపీసీకి చెందిన పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత కలుసుకొని తమ చిన్న నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు తమ బాగోగులు తెలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ వర్ధెల్లి మురళి మాట్లాడుతూ.. యాభై ఏళ్ల క్రితం ఈ కళాశాలలో చదువుకున్న తాము మళ్లీ ఇప్పుడు కలుసుకోవడం ఎంతో పునరుత్తేజాన్ని ఇచ్చిందన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇలాంటి వేడుకలు ప్రతి బ్యాచ్ నిర్వహించుకుని తమ పాత స్నేహితులను కలుసుకొని మధురానుభూతి పొందాలన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శంకర్, శ్యాంసుందర్, అశోక్, రాజేంద్రప్రసాద్, నరేందర్ రెడ్డి, పిచ్చిరెడ్డి, రంగారెడ్డి, అశ్విని కుమార్, నరసింహారావు, డాక్టర్ రామచంద్రరావు, జగన్, రంజన్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న
పూర్వ విద్యార్థులు


