శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా ప్రజలకు ‘ఎన్టీఆర్ భరోసా’ నూతన పింఛన్ల నమోదు ప్రక్రియ ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల్లో నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు కె.వినాయకం ఓ ప్రకటనలో తెలిపా రు. కొత్తగా పింఛన్ కోసం నమోదు చేసుకోవాలనుకునే అర్హులైన వారు తమ సమీప స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల్లో డిజిటల్ అసిస్టెంట్లు లేదా వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులను నేరుగా సంప్రదించాలని తెలిపారు. ఆధార్ కార్డుతో పాటుగా అవసరమైన ఇతర అర్హత, ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జీతాలు చెల్లించాలంటూ పెద్ద ఎత్తున నిరసన
సంతబొమ్మాళి: మూలపేట పోర్టులో పని చేస్తు న్న సిబ్బంది జీతాలు చెల్లించాలంటూ మంగళవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పోర్టుకు వెళ్లే రహదారి దిగ్బంధించడంతో పాటు పోర్టు గేటును తాళ్లతో కట్టి రాకపోకలు ఆపేశారు. పెద్ద ఎత్తున సిబ్బంది మోహరించి జీతాలు చెల్లించాలంటూ నినాదాలు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోర్టు జీఎం శంకర్, టెక్కలి రూరల్ సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో మాట్లాడారు. మూడు నెలలుగా జీతాలకు గాను ఒక నెల జీతం వెంటనే చెల్లించారు. మరో నెల జీతం 15వ తేదీలోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సిబ్బంది తమ నిరసన విరమించారు.
నేత్రదానంపై విస్తృత ప్రచారం
అరసవల్లి: నేత్రదానంపై అపోహలు తొలగించి మరింత విస్తృతం చేసేలా ప్రజల్లో అవగాహన తేవాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఈవీ నరేష్కుమార్ పిలుపునిచ్చారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేత్రదానంపై ఎలాంటి అపోహలు ఉండకూదని, వైద్య శాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలు చైతన్యం తీసుకురావాలని కోరారు. అనంతరం డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేపట్టిన తర్వాత వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన నర్సింగ్ విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.


