● బేస్బాల్ అసోసియేషన్ జిల్లా
అధ్యక్షురాలు తమ్మినేని సుజాత
● జిల్లా బేస్బాల్ జట్ల ఎంపికలకు పోటెత్తిన క్రీడాకారులు
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం జిల్లాలో సంఘ ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో బేస్బాల్ క్రీడను మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్తామని జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు తమ్మినేని సుజాత పేర్కొన్నారు. జిల్లా సీనియర్స్ పురుషులు, మహిళల బేస్బాల్ జట్ల ఎంపిక పోటీలు బుధవారం శ్రీకాకుళం నగరంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా జరిగాయి. ఈ సెలక్షన్ ట్రయల్స్కు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పోటెత్తారు. సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా బేస్బాల్ ప్రాబబుల్స్ జట్లకు ఎంపిక చేసినట్టు జిల్లా బేస్బాల్ సంఘ ప్రతినిధులు వెల్లడించారు. జిల్లా ప్రాబబుల్స్ జట్లకు సెప్టెంబర్ 4 నుంచి 9వ తేదీ వరకు ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు గ్రామంలో నిర్వహించనున్న శిక్షణా శిబిరాల అనంతరం, జిల్లా తుది జట్లను ప్రకటిస్తామని కార్యనిర్వహణ కార్యదర్శి కొండపల్లి రవికుమార్ చెప్పారు.
పుట్టపర్తిలో రాష్ట్రస్థాయి పోటీలు
జిల్లా జట్లను శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనున్న 8వ ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్(మెన్, ఉమెన్) బేస్బాల్ ఛాంపియన్ షిప్–2026 పోటీలకు పంపించనున్నట్లు జిల్లా బేస్బాల్ సంఘ ప్రధాన కార్యదర్శి గుంటముక్కల వీరభద్రరావు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సమష్టిగా రాణించి పతకం సాధించడమే లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, కొండపల్లి కిరణ్కుమార్, హెచ్ఎం యాళ్ల పోలినాయుడు, సీనియర్ పీడీలు చల్లా జగదీశ్, సాధు శ్రీనివాసరావు, లకిలీ రాంబాబు, సింహాద్రినాయుడు, రామాంజనేయులు, రవిబాబు, సంఘ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.


