● మంత్రి అచ్చెన్నపై పేరాడ తిలక్
మండిపాటు
టెక్కలి: జిల్లాలో స్థానిక వనరులకు అనుకూలంగా పరిశ్రమలను ఏర్పాటు చేసి వాటి ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేలా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టును తీసుకువచ్చారని.. కూటమి ప్రభుత్వంలో మాత్రం కొన్ని రకాల కెమికల్స్ కంపెనీల నుంచి భారీగా కమీషన్లకు కక్కుర్తి పడి మంత్రి అచ్చెన్నాయుడు ఆయా పరిశ్రమల ఏర్పాటుకు పోర్టు పరిసర ప్రాంతాల్లో భూములిచ్చేందుకు సిద్ధమవుతున్నారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. ఆదివారం టెక్కలిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ టెక్కలి నియోజకవర్గంతో పాటు జిల్లాలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునేలా పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ఈ ప్రాంతాన్ని దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోర్టు పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు గతంలో హల్దియా పెట్రో కెమికల్స్, కళ్యాణి స్టీల్స్, యమునా గ్రీన్ అమోనియా, హెఎంపీఎల్, నాల్కో, విశాఖ పోర్టు ట్రస్టు, గెయిల్, బీపీసీఎల్, ఎగ్జాంబుల్ తదితర కంపెనీలు ముందుకు వస్తే, ఆయా కంపెనీల నుంచి మంత్రి అచ్చెన్నాయుడు భారీగా కమీషన్లు డిమాండ్ చేయడంతో వారంతా పారిపోయారని చెప్పారు. గతంలో పవర్ప్లాంట్ ఏర్పాటుకు సేకరించిన సుమారు 1800 ఎకరాల భూమి ఆయా కంపెనీ నుంచి అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కేవలం పుష్కలంగా పంటలు పండిస్తున్న రైతుల భూములపైనే మంత్రి కన్నుపడిందన్నారు. తాము పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, రెడ్జోన్లో ఉండాల్సిన పరిశ్రమలను కమీషన్ల కోసం కక్కుర్తి పడి ఈ ప్రాంతంలో విధ్వంసకరమైన దుస్థితికి తీసుకురావొద్దని తిలక్ పేర్కొన్నారు. పోర్టుకు అనుసంధానంగా ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమలు, గ్రానైట్ ఆధారిత పరిశ్రమలు, ఆక్వా, ఖాదీ, కొబ్బరి, జీడి ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసేలా దృష్టి సారించాలని, అంతే తప్పా భారీగా కమీషన్ల వస్తాయనే ఆశతో రెడ్జోన్లో ఉండాల్సిన పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒకే ఇంట్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఉన్నప్పటికీ స్థానిక వనరులకు అనుకూలంగా పరిశ్రమలను తీసుకురాలేని అసమర్థత మంత్రులుగా మిగిలిపోతున్నారని దుయ్యబట్టారు. కెమికల్స్ పరిశ్రమ కోసం ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 211పై మరో సారి పునరాలోచన చేసి దానిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై స్థానిక రైతులు, ప్రజల అభిప్రాయాలతో పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళతామని స్పష్టం చేశారు. ఈయనతోపాటు నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, పార్టీ పట్టణ అధ్యక్షుడు తమ్మన్నగారి కిరణ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కర్నిక జీవన్, ఆర్టీఐ వింగ్ అధ్యక్షుడు బి.రాజేష్ ఉన్నారు.


