జి.సిగడాం(పొందూరు):
విశాఖపట్నంలో పర్యావరణాన్ని విధ్వంసం చేసేందుకు కూటమి ప్రభుత్వం డేటాసెంటర్లను ఏర్పాటు చేస్తోందని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త వి.ఎస్.కృష్ణ అన్నారు. ఆదివారం పొందూరు మండల కేంద్రంలో శ్రీరామా ఐటీఐ ప్రాంగణంలో డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ విద్యాసదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖను నాశనం చేయడానికే కంకణం కట్టుకున్నాయని చెప్పారు. డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే 300 మందికే ఉద్యోగాలు వస్తాయన్నారు. 2017న పోలవరం నీటిని ఉత్తరాంధ్ర ప్రజలకు అందిస్తామని చంద్రబాబు చెప్పినా ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్వీ రమణయ్య, రాష్ట్ర మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు మాట్లాడుతూ సామాజిక సంక్షోభంలో చిక్కుకున్న విద్యారంగాన్ని కాపాడుకునేందుకు ఉపాధ్యాయులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. అనంతరం పేడాడ కృష్ణారావు రచించిన వ్యాస సంపుటి ఈ అడుగులు ఏ ప్రస్థానానికి పుస్తకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ పట్నాన రాజారావు, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.హరి, విజయనగరం జిల్లా కన్వీనర్ దుర్గాశి గణేష్, ప్రధాన కార్యదర్శి కుమ్ము అప్పలరాజు, మండల శాఖ అధ్యక్షుడు గురుబిల్లి వెంకటరావు, రాజశేఖరం, బి.గున్ననాయుడు, తమ్మినేని మురళీ, జి.భాస్కరరావు, తమ్మినేని సన్యాసిరావు, జి.బాలకృష్ణ, పార్వదేశం రమణమూర్తి, గండం రామారావు, మధుసూదనరావు, మోహన్రావు పాల్గొన్నారు.


