పాతపట్నం: సవరసిద్దమనుగు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని ఆదివాసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి డిమాండ్ చేశారు. శనివారం విద్యార్థులతో తల్లిదండ్రులతో కలిసి ఆశ్రమ పాఠశాల వద్ద ధర్నా చేపట్టారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు మూసివేయవద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు చినబాబుకు వినతిపత్రం అందజేశారు. 20 ఏళ్లుగా ఆదీవాసీ ప్రాంత గిరిజనులు తమ పిల్లలను ఆశ్రమ పాఠశాలలో చదివిస్తున్నారని, తక్కువ మంది పిల్లలు ఉన్నారని 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ఆశ్రమ పాఠశాలలో విలీనం చేయడం తగదన్నారు. ధర్నాలో సవరసిద్దమనుగు, దిగువ మనుగు, ఎగువ మనుగుతో పాటు పరిసర గిరిజన గ్రామాల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


