శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎన్నికల సమయంలో కూటమి నాయకులు న్యాయవాదులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో యువ న్యాయవాదులకు ‘లా నేస్తం పథకం’ ఎంతగానో ఆదుకుందన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ రూ.10,000 ఇస్తామని చెప్పి రెండేళ్లు గడిచినా అమలు చేయకపోవడం సరికాదన్నారు. న్యాయవాదుల మరణానంతరం బార్ కౌన్సిల్ అందిస్తున్న డెత్ బెనిఫిట్స్కి సమానంగా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ పెంచాలని, న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకుని రావాలని డిమాండ్ చేశారు.
ద్విచక్ర వాహనం చోరీ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధి డగ్లస్స్కూల్ సమీపంలో ద్విచక్ర వాహనం చోరీపై ఫిర్యాదు అందిందని సీఐ పి.ఈశ్వరరావు తెలిపారు. గత నెల 20న రాత్రి తన నివాసగృహం ముందు పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనం ఆచూకీ లభించకపోవడంతో రాధాకృష్ణ అనే వ్యక్తి శనివారం పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.


