అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈనెల 2న జ్యేష్ట బహుళ విదియ గురువారం ఉదయం 7.09 గంటలకు బ్రాహ్మణ బాలురుకి సామూహిక ఉపనయనాలు జరిపిస్తున్నట్లుగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆరామ ద్రావిడ సంఘం జిల్లా కార్యదర్శి దార్లపూడి రవి తదితరులు ప్రకటించారు. ఈ మేరకు మొత్తం 22 మంది బాలురుకు ఉపనయనాలు పూర్తిగా ఉచితంగా చేపడుతున్నామని, ఆది త్యుని సన్నిధిలో ఇలాంటి కార్యక్రమాన్ని జరిపించుకోవడం ఒక అదృష్టమని వివరించారు.
ఇంటింటి సర్వేపై దిశానిర్దేశం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా నవీకరణలో భాగంగా చేపట్టిన ఇంటింటా సర్వే ప్రక్రియను అత్యంత సమర్థంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం అధికారి పవన్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా ఈ సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలో ప్రస్తుతం సాగుతున్న ఇంటింటా సర్వే పురోగతిని, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి వివరించారు. ఈ పనులను గడువులోగా, ఎలాంటి తప్పుల్లేకుండా పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను నివేదించారు.
మూన్నాళ్ల ముచ్చటేనా..?
మందస: మందస మండలం మకరజోల పంచాయతీ అల్లిమెరక గ్రామానికి హరిపురం నుంచి వేసిన రోడ్డు అప్పుడే విరిగిపోయింది. కొద్ది నెలల కిందటే ఈ రోడ్డు వేయగా.. ఇది మూన్నాళ్ల ముచ్చటగా మారిందని స్థానికులు అంటున్నారు. రోడ్డును ఇలాగే వదిలేస్తే ప్రమాదాలు జరుగుతాయని, అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
మొగిలిపాడులో కంకర అక్రమ నిల్వలు
పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని 2వ వార్డు మొగిలిపాడులో రియల్ ఎస్టేట్ వ్యా పారులు కంకర అక్రమ నిల్వలు భారీ స్థాయిలో డంప్ చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రియల్ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు వేయడం, దాన్ని చదును చేయడానికి అక్రమంగా కొండలను కరిగించి కంకర తీసుకొచ్చి ఈ విధంగా డంప్ చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల మొగిలిపాడు గ్రామం జాతీయ రహదారి పక్కన, ప్రస్తుతం కంకర నిల్వ ఉన్న అతి సమీపంలోనే వెంచర్లు వేశారు. దానికి సమీపంలోనే చెరువు, వరద కాలువ కూడా ఉంది. వాటిని కప్పేసి అందులో కలు పుకోవడానికి ఈ విధంగా అక్రమంగా కంకర అర్ధరాత్రి పూట కంకర తీసుకొచ్చి నిల్వ చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ఈ రియల్ ఎస్టేటు ప్లాట్లుపై రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. దీనికి ఎలాంటి అనుమతులు లేవని మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నా, అక్కడ పనులు మాత్రం రాత్రిపగలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పైగా విద్యుత్ స్తంభాలు కూడా వేశారు.


