నరసన్నపేట: ‘అధికారులకు మొర పెట్టుకున్నాం.. ఎమ్మెల్యేను కలిశాం. ఎవరూ స్పందించలేదు. మా సమస్యలు పరిష్కరించని వారికి మేమెందుకు ఓటెయ్యాలి. మేము అసలు ఓటు వేయం. సర్ కార్యక్రమాన్ని కూడా బహిష్కరిస్తాం..’ నరసన్నపేట మండలంలోని వజ్రంపేట వాసుల ఆక్రందన ఇది. తాగునీటి సమస్య పరిష్కరించాలని సోమవారం ఉదయం పంచాయతీ కార్యాలయాన్ని మహిళలు చుట్టుముట్టారు కూడా. చాలాకాలంగా సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మంగళవారానికి నీరు వస్తుందని ఆశించినా చుక్క నీరు కూడా రాలేదు. దీంతో ప్రభుత్వం, అధికారులపై స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


