శ్రీకాకుళం/శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో జిల్లాలోని అర్హులైన దళిత ఓటర్ల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ దళిత సంఘాల జేఏసీ నాయకులు మంగళవారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను కలెక్టరేట్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కంఠ వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి తైక్వాండో శ్రీను మాట్లాడుతూ జిల్లాలోని అనేక గ్రామాల్లో నిరక్షరాస్యులు, వృద్ధులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు అధికంగా ఉన్నందున సర్ ప్రక్రియలో అవసరమైన పత్రాలు సమర్పించడం, దరఖాస్తులు నింపడం వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కేవలం సాంకేతిక కారణాలు, పత్రాల లోపాల పేరుతో అర్హులైన దళిత ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. గ్రామాలు, దళితవాడల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు బూత్ లెవల్ అధికారులు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, నిరక్షరాస్యులకు ఇంటి వద్దే సేవలు అందించి వారి దరఖాస్తులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.


