రణస్థలం: మండలంలోని జేఆర్పురం పోలీస్ సర్కిల్ పరిధిలో ఇటీవల కాలంలో జరిగిన వరుస బైక్ చోరీల దొంగలను జేఆర్పురం సర్కిల్ పరిధి పోలీసులు పట్టుకున్నారని జేఆర్పురం సీఐ ఎం.అవతారం తెలిపారు. ఈ మేరకు పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రణస్థలం పరిధిలో 6 ద్విచక్ర వాహనాలు, లావేరులో 1, జి.సిగడాంలో 1 మొత్తం 8 ద్విచక్ర వాహనాలు, లావేరులో ఒక వ్యవసాయ మోటారు ఇటీవల కాలంలో దొంగిలించారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు. జే.ఆర్.పురం, సీతంవలస పరిధిలో నలుగురు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. అయితే వారిలో ముగ్గురు మైనర్లు కాగా.. ఒక వ్యక్తి లావేరు మండలంలోని బుడతవలస గ్రామానికి చెందిన కుప్పిలి హరిగా పేర్కొన్నారు. మైనర్లులంతా లావేరు మండలంలోని ఒక గ్రామానికి చెందినవారే. అలాగే ఈ బైకులు కొనుగోలు చేసిన ఇనుప తుక్కు దుకాణం నిర్వాహకుడు అదపాక గ్రామానికి చెందిన బెజ్జిపురపు వెంకట నాయుడును ఆరెస్టు చేశామని తెలిపారు. వీరి నుంచి ఐదు బైకులు, ఒక వ్యవసాయ మోటారు రికవరీ చేశారు. మిగతా మూడు బైకులు తుక్కుకు అమ్మేశారు. సమావేశంలో జేఆర్పురం, లావేరు, జి.సిగడాం ఎస్లు ఎస్.చిరంజీవి, కె.అప్పలసూరి, సందీప్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ కె.కిరణ్ కుమార్, ఎం.జోగారావు, లావేరు కానిస్టేబుల్ లక్ష్మణరావు, హేమంత్, ఎచ్చెర్ల కానిస్టేబుల్ రవి కుమార్ తదితరులు ఉన్నారు.


