2.90 లక్షల డోసులు సిద్ధం
● నేటి నుంచి పల్స్ పోలియో ● జిల్లాలో 1096 బూత్ల్లో 84 మొబైల్ బృందాల నియామకాలు
అరసవల్లి: జిల్లాలో ఆదివారం నుంచి పల్స్ పోలి యో కార్యక్రమం మొదలు కానుంది. 28, 29,30 తేదీల్లో పల్స్పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పక్కా ఏర్పాట్లు చేశారు. ఐసీడీఎస్, విద్యాశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ, యూత్, మహిళా సంఘాల కోఆర్డినేటర్లు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 30 మండలాల్లో ఐదేళ్ల లోపు వయసు గల చిన్నా రులు సుమారుగా 1,80,879 మందిని గుర్తించి, అందరికీ ఈ మూడు రోజుల్లో టీకా చుక్కలు వేయించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం చర్యలకు దిగింది.
ఇంటింటికీ లక్ష్యంగా..
జిల్లాలో పోలియో నియంత్రణకు గాను మొత్తం 71 పీహెచ్సీలు, 13 యూపీహెచ్సీల పరిధిలో నేటి నుంచి మూడు రోజుల పాటు పోలియో చుక్కలను వేయించేందుకు వైద్య శాఖ అన్ని ఏర్పా ట్లు చేసింది. మొదటి రోజు ఆదివారం నాడు ప్రాథమిక పాఠశాలలు తెరుచుకునేలా ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో మొత్తం 1096 పోలియో బూత్లను సిద్ధం చేయగా.. తొలిరోజు ఈ బూత్ల వద్ద పోలి యో చుక్కలను వేయనున్నారు. అలాగే తర్వాత 29, 30 తేదీల్లో బూత్ల్లో టీకాలు వేయించుకోని వారిని గుర్తించేందుకు సుమారు 6,11,630 ఇళ్లను సందర్శించి ఇంటింటికీ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలనే లక్ష్యంతో వైద్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఆశవర్కర్లు, అంగన్వాడీలు, వైద్యశాఖ సిబ్బంది, ఏఎన్ఎంలు, హెల్త్అసిస్టెంట్లు ఇలా అన్ని స్థాయిలో సిబ్బంది ఈ వ్యాక్సినేషన్కు సిద్ధం చేస్తున్నారు. అలాగే వీధులు, పొలాలు, ఆట స్థలాల్లో పిల్లల కోసం 84 మొబైల్ బృందాలను, ప్రయాణికులకు వీలుగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, సంతలు, దేవాలయాల వద్ద కూడా 40 ట్రాన్సిట్ బూత్లను ఏర్పాటు చేశారు. ఈ మొత్తం కార్యక్రమం కోసం 7,430 మంది సిబ్బంది, పర్యేవేక్షణకు 122 మందిని నియమించారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల చిన్నారులకు పోలియో టీకాలను వేయించేలా అన్ని చర్యలు చేపట్టాం. మొత్తం 1,80,879 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయించేందుకు గాను మొత్తం 2.90 లక్షల డోసులను డీప్ ఫ్రీజర్లులో ఉంచుతూ పంపిణీ చేశాం. 28న దాదాపుగా ఈ పోలియో చుక్కలను అందరికీ వేయించాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టాం. తర్వాతి రెండు రోజులు ఇంటింటికీ తిరిగి మిగిలిన వారికి టీకాలు వేయించాలని ఆదేశించాం.
– డాక్టర్ కె.అనిత, డీఎంహెచ్ఓ


