● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం రూరల్: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ జాబితా(ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. మండల పరిధిలోని సింగుపురం గ్రామంలో శనివారం ఆయన పర్యటించి బీఎల్వోల పనితీరుపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని జిల్లాలో పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 8 శాసనసభ నియోజకవర్గాల్లోని 30 మండలాల పరిధిలో 2,358 మంది బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ)లు కుడా బీఎల్వోలతో కలిసి సమన్వయంగా కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఓటరు జాబితాలో నమోదైన ప్రతీ ఓటరు వివరాలను, కుటుంబ వివరాలతో అనుసంధానం (మ్యాపింగ్) చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 88 శాతం మ్యాపింగ్ పూర్తి కావడంతో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. నిరక్షరాస్యులు, వృద్ధులు, సమయం లేని ఓటర్లకు సాయంగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఇతర శాఖల సిబ్బంది సహకారంతో ఫారాలు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి, ఎంపీడీవో ప్రకాశ్రావు, ఈవోపీఆర్డీ సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ ఆదిత్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.


