సంతబొమ్మాళి: మండలంలోని కె.లింగూడు పంచాయతీ ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన మోసా గురుమూర్తి (48) అనే మత్య్సకారుడు గోవాలో సముద్రపు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో వారం రోజులు క్రితం తోటి మత్య్సకారులతో కలిసి గోవా వెళ్లాడు. శుక్రవారం సాయంత్రం సముద్రంలో చేపల వేట చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురై మృతి చెందాడని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందింది. మృతుడికి భార్య గిరమ్మ, కుమారులు రామకృష్ణ, వివేక్లు ఉన్నారు. మరణవార్త విని గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని మత్య్సకారులు కోరుతున్నారు.
ఇరువర్గాలపై కేసులు నమోదు
కొత్తూరు: మండలంలోని మహాసింగి గ్రామ సమీపంలో పంట భూమి విషయమై కర్లెమ్మ పంచాయతీ పరిధి అఫీషియల్ కాలనీకి చెందిన పొందూరు తేజేశ్వరరావు కుటుంబ సభ్యులు, మహాసింగి గ్రామానికి చెందిన కొవ్వాడ గోపాలు కుటుంబ సభ్యులకు మధ్య శుక్రవారం కొట్లాట జరిగింది. అనంతరం ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె.వెంకటేష్ శనివారం తెలిపారు.


