ఎచ్చెర్ల: నాలుగేళ్ల బీఈడీ కోర్సులకు సంబంధించి సమీకృత ఉపాధ్యాయ విద్యా కార్య క్రమం (ఐటీఈపీ)లో ప్రవేశానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఈ విద్యా సంవ్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోందని రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య తెలిపారు. ఎన్టీఏ జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత చెందిన వారు దరఖాస్తులు చేయడానికి అర్హులని తెలియజేశారు. చెరో 50 సీట్లతో బీఎస్సీ, బీఈడీ, బీఏబీఈడీ కోర్సులను డాక్టర్ బీఆర్ఏయూ ఆఫర్ చేస్తుందని తెలిపారు. దరఖాస్తులు వచ్చే నెల 4 వ తేదీవరకూ యూనివర్సిటీకి అందజేయవచ్చని తెలి పారు. ఈ వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్యూ.బీఆర్ఏయూ.ఈడియూ.ఇన్ను సందర్శించి తెలుసుకోవచ్చని రిజిస్ట్రార్ బి.అడ్డయ్య సూచించారు.
జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు జీవన్ కుమార్
జలుమూరు: జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు పాగోడు ప్రాథమిక పాఠశాల విద్యార్థి కె.జీవన్కుమార్ అర్హత సాధించాడు. గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపి ఏపీ నుంచి ఒకే ఒక్క విద్యార్థి ఎంపికయ్యాడు. దీనిపై పాగోడుతోపాటు స్వగ్రామం బోరవాని పేట గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి జీవన్ కుమార్ ప్రథమ స్థానంలో నిలిచాడు. జీవన్ కుమార్ తల్లి రోహిణిది వ్యవసాయ కూలి కుటుంబం. డిసెంబర్ నెలలో మధ్య ప్రదేశ్ జబల్పూర్లో జరగనున్న ఈ సైక్లింగ్ పోటీల్లో జీవన్ కుమార్ పాల్గొననున్నాడు. ఈ విద్యార్థి ఇటీవలే 1200 సీడ్బాల్స్ తయారు చేసి సోషల్ మీడియాతోపాటు పలు ప్రచార మాధ్యమాల్లో వైరల్ అయ్యాడు.
‘ప్రతి వాహనం తనిఖీ చేయాలి’
ఇచ్ఛాపురం: అంతర్రాష్ట్ర చెక్ పోస్టుకు ఒడిశా నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని విశాఖపట్నం రేంజ్ పోలీస్ ఐజీ గోపీనాథ్ జెట్టీ సూచించారు. ఆయన శుక్ర వారం సరిహద్దులోని పురుషోత్తపురం అంతర్రాష్ట్ర చెక్పోస్టుని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, గంజాయి రవాణాపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐ మీసాల చిన్నంనాయుడు, ఎస్ఐ ఎం.ముకుందరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
‘ఆశ్రమ పాఠశాలలు మూసివేస్తే ఉద్యమమే’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రేషనలైజేషన్ పేరుతో గిరిజన ఆశ్రమ పాఠశాలలను కుదించే కుట్రకు కూటమి ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించక తప్పదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ యోగి హెచ్చరించా రు. శ్రీకాకుళం నగరంలో ఇలిసిపురంలోని అంబేడ్కర్ విజ్ఞాన భవన్లో శుక్రవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాబ యోగి మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గత ఏడాది మే 15న జారీ చేసిన మెమోను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. రేషనలైజేషన్ చేస్తే చాలా ఆశ్రమ పాఠశాలలు మూతపడతాయని, కొండ కోనల్లో సమాజానికి దూరంగా ఉన్న ఆదివాసీలను విద్యకు దూరం చేయాలన్న చంద్రబాబు కుట్రను తిప్పికొడతామన్నారు. గిరిజనులపై కూటమి ప్రభుత్వానికి చిన్నచూపు తగదన్నా రు. ఆదివాసీలకు ఇచ్చిన సీఆర్టీ ఉద్యోగాలు పోతాయని, ఏజెన్సీలో ప్రత్యేక డీఎస్సీ నిర్వహించే పరిస్థితి ఉండదని, ఆదివాసీ నిరుద్యోగ యువత ఉపాధికి దూరమైపోతారన్నారు. సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారి యడ్ల సూరినారాయణ, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్, ఏపీటీడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గేదెల శేషగిరి, సన్నశెట్టి రాజేశేఖర్ తదితరులు మాట్లాడారు.


